ఆర్నెల్లకోసారి కనిపించే పవన్ నాయుడు వల్ల ఏం ప్రయోజనం : ఉండవల్లి శ్రీదేవి సెటైర్లు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సెటైర్లు వేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ లేని స్టార్ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తనలాంటి కొత్తవాళ్ళే గెలిచి అసెంబ్లీకి వెళితే, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆరు నెలలకు ఒక సారి కనిపించే పవన్ నాయుడు వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని, జరిగేదేమీ లేదని ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత సంక్షేమ పాలనతో ఎక్కువ స్థానాలు గెలుస్తామని ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కంచుకోట లను సైతం వైసిపి బద్దలు కొట్టిందని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికలలో టీడీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున గెలిచారనే ప్రచారం అవాస్తవమని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొట్టిపారేశారు. రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా వైసిపి దూసుకుపోవడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ నాయకత్వాన్ని ఆదరిస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే శ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు.