అసలే గుంటూరు..! లోకేష్, రాయపాటి, కోడెల ఎపిసోడ్ తో జిల్లాలో రాజకీయ ప్రకంపనలు ..!!
అది ముందే గుంటూరు. పైగా ఎన్నికల సీజన్.. టీడిపి ముఖ్యనేతల ఎపిసోడ్, వలసలతో రాజకీయం వాడి వేడిగా మారింది. ఎవరు అధికారంలోకి వచ్చినా.. ఏ పార్టీ విపక్షంలో కూర్చున్నా.. చక్రం తిప్పటంలో గుంటూరు నేతలు కీలక పాత్ర పోషిస్తుంటారు. పైకి కనిపించని ఎన్నో సమీకరణాలు రాత్రికి రాత్రే మారిపోతుంటాయి. పక్కనే ఉంటూ.. అదను చూసి దెబ్బకొట్టే నాయకులూ సదా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడిప్పుడే ఈ సెగలు.. అధికార టీడీపీ.. విపక్షపార్టీ వైసీపీలను తాకుతోంది. డెల్టా నుంచి పల్నాడు వరకూ పొలిటికల్ హీట్ మొదలైంది. తాజాగా లోకేష్, రాయపాటి, కోడెల పరిణామాలతో రాజకీయం మరింత వేడెక్కింది.
ఎక్కడంటే అక్కడ 'అది' చెప్తే ఊరుకుంటారా..? కొన్ని దేశాల్లో తాట తీస్తారు మరి..!!
గరమైన గుంటూరు రాజకీయం..! నేతల కొరబడ్డ ఏకాభిప్రాయం..!!
మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ కు కేటాయించటంతో కాంగ్రెస్ను వదిలి టీడీపీలోకి చేరిన కాండ్రు కమల పరిస్తితి అగమ్యగోచరంగా తయారయ్యింది. 2009లో ఎమ్మెల్యేగా నెగ్గిన ఆమె గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. టీడీపీ తరపున పోటీపడిన గంజి చిరంజీవి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 12 ఓట్ల తేడాలో ఓడారు. ఈ సారి గంజికి సీటు అంటూ ప్రకటించారు. అనంతరం మైనార్టీ నేత పేరు తెరమీదకు తెచ్చారు. ఇంతలో కాండ్రు కమల సైకిల్ ఎక్కటంతో ఆమెకూ మాటిచ్చారు. ఇప్పుడు ముగ్గురినీ కాదని లోకేష్కు సీటు కేటాయించటంతో అంతర్గతంగా రచ్చ మొదలైంది. అందుకే చినబాబు అందర్నీ ప్రసన్నం చేసుకునేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. బీసీ నేతల మనసు గెలవాలనుకుంటున్నారు. లోకేష్ గెలవటం ఆయనకే కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబునాయడుకూ సవాల్గా మారింది.
ఒక్కోనేతది ఒక్కోదారి..! విచిత్రంగా మారిన గుంటూరు నేతల వ్యవహావరం..!!
ఇక నర్సరావుపేట నాకొద్దంటూ రాయపాటి సాంబశివరావు మొండిపట్టుపట్టారు. అసెంబ్లీకు వెళ్లాలనే ఆశను వ్యక్తంచేశారు. సత్తెనపల్లి అయితే తేలికగా బయటపడవచ్చని భావించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్కు పొగ పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే అదనుగా అక్కడ కోడెల వ్యతిరేక వర్గం అవకాశంగా మలచుకుంది. కోడెల వద్దు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి మరీ ర్యాలీలు చేయటం.. పైగా.. కోడెల తిరిగిన ప్రాంతం అప్రతిష్ఠపాలైందంటూ.. పసుపునీళ్లతో శుద్ధిచేయటం కూడా కోడెలకు మింగుడు పడకుండా చేశాయి. సత్తెనపల్లి, నర్సరావుపేటల్లో కే ట్యాక్స్ పేరిట.. కోడెల కొడుకు, కూతుళ్లు సాగించిన దందాపై జనం విసుగెత్తారు. దాని ప్రతిఫలమే.. కోడెలకు ఇంతటి గడ్డుకాలం. పోనీ రాయపాటి అంటే అభిమానం ఉందా అంటే అదీ అంతంత మాత్రమేనని చెప్పాలి.
ఎవరికి వారు యమునా తీరు..! బాబుకు తలనొప్పిగా మారిన నేతల తీరు..!!
తరచూ టీడీపీను విమర్శిస్తూ చంద్రబాబుకు పలుమార్లు చికాకు పుట్టించారు. టీటీడీ ఛైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న రాయపాటికి చుక్కెదురైంది. దీంతో పార్టీకు దూరంగానే ఉంటన్నారు. నర్సరావుపేటలో టీడీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే పేరు తెచ్చుకున్నారు. తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ కు సీటు ఇవ్వవద్దంటూ తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. మరో వర్గం ఆయనే ఉత్తమం అంటూ వంతపాడుతున్నారు. డొక్కాకు టికెట్ కేటాయిస్తే ఓడిస్తామంటూ ఓ వర్గం అల్టిమేటం జారీ చేసింది. చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై కూడా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది.
కీలకం కానున్న గుంటూరు..! విజయం పై నెలకొన్న ఉత్కంఠ..!!
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గుంటూరు పశ్చిమం మన్నవ మోహన్కృష్ణ, సుబ్బారావు, చందు సాంబశివరావు వంటి సీనియర్లు ఆశపడుతున్నారు. బ్రాహ్మణ వర్గానికి ఇవ్వాలంటూ ఆ వర్గ నేతలు ఒత్తిడి కూడా తెస్తున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్పై అంతర్గతంగా వ్యతిరేకత ఉంది. దాన్నుంచి ఆయన్ను బయటపడేసేందుకు మంగళగిరి సీటు లోకేష్ కు కేటాయించారనే విమర్శలూ లేకపోలేదు. విజయడైరీ నిర్వహణలో పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రచౌదరిపై వ్యతిరేకత కూడా ఇబ్బంది పెడుతోంది. వేమూరు, తెనాలి వంటి చోట్ల కూడా పార్టీ ఆందోళనకరంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది.