123 సంవత్సరాల కిందటి బ్రిటీష్ చట్టాన్ని జనంపై ప్రయోగిస్తోన్న జగన్, కేసీఆర్: కఠిన నిర్ణయాలతో కలకలం..!
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సంయుక్తంగా ముందడుగు వేస్తున్నాయి. ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన జనతా కర్ఫ్యూ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో అదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఉమ్మడిగా లాక్డౌన్కు పిలుపునిచ్చాయి. ఈ నెల 31వ తేదీ వరకు బంద్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి.
ఏదైనా చట్టానికి లోబడే..
ఇటు జగన్ ప్రభుత్వం గానీ, అటు కేసీఆర్ సర్కార్ గానీ.. జనజీవనంతో ముడిపడి ఉన్న ఎలాంటి నిర్ణయాన్నయినా చట్టానికి లోబడే తీసుకోవాల్సి ఉంటుంది. కోట్లాదిమంది ప్రజల రోజువారీ జీవనాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలను గానీ, ఆదేశాలను గానీ అలవోకగా తీసుకోవడానికి అవకాశమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ను ప్రకటించడానికి ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు 123 సంవత్సరాల కిందటి చట్టాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి.
ఇంతకీ.. ఏమిటా చట్టం?
వందేళ్లు పైగా.. ఆ మాటకొస్తే 123 సంవత్సరాల వయస్సున్న ఆ చట్టాన్ని కరోనా వైరస్పై యుద్ధాన్ని ప్రకటించడానికి దుమ్ము దులపడం చర్చనీయాంశమైంది. అందరి దృష్టీ ఆ చట్టం మీదే నిలిచింది. అదే- ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897. కరోనా వైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారి తరహా పరిస్థితులు ఏర్పడినప్పుడు అమలు చేయడానికి ఉద్దేశించిన చట్టం అది. 1897లో రూపుదిద్దుకుంది ఇది. అదే ఇప్పుడు కరోనా వైరస్ను నియంత్రించడానికి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీన్ని ప్రయోగించాయి. పలు కఠిన నిర్ణయాలను తీసుకున్నాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని జైలుకు పంపించే అవకాశాలు ఉన్నాయి.
ఈ చట్టం చరిత్ర ఏంటీ?
1896లో అప్పటి బోంబే ప్రెసిడెన్సీలో వ్యాపించిన భయానక ప్లేగు వ్యాధిని నియంత్రించడంలో భాగంగా అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. అదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఎలుకల నుంచి పుట్టుకొచ్చిన ఈ ప్లేగు వ్యాధిని అరికట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం ఈ చట్టానికి లోబడే కఠిన నిర్ణయాలను తీసుకుంది. ఇప్పట్లాగే- ప్రజలు రోడ్డు మీద తిరగకుండా కట్టడి చేసింది. స్వీయ గృహనిర్బంధంలోకి నెట్టింది. ఒకరి నుంచి మరొకరికి ప్లేగు వ్యాధి సోకకుండా.. ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను దాటుకుని వ్యాధిగ్రస్తులు ఎవరూ బయట అడుగు పెట్టకూడదని ఆదేశించింది.
ఈ 123 సంవత్సరాల కాలంలో మూడుసార్లే ప్రయోగం..
1897లో ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ మూడుసార్లు మాత్రమే దీన్ని తెరమీదికి తీసుకుని వచ్చారు. 2009లో స్వైన్ఫ్లూ సోకిన సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం కింద పుణేలో కఠిన నిర్ణయాలను తీసుకుంది. ఈ చట్టం కిందే లాక్డౌన్ను ప్రకటించింది. 2015లో చండీగఢ్లో మలేరియా, డెంగ్యూ కేసులు విస్తృతంగా వ్యాపించిన పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కలరాను నియంత్రించడానికి గుజరాత్లోని వడోదర జిల్లా కలెక్టర్ ఈ చట్టాన్ని 2018లో తెరపైకి తీసుకొచ్చారు.