వైసీపీలో రచ్చరంబోలా!...జగన్ను కూడా రొచ్చులోకి లాగేశారు:పార్టీ శ్రేణుల్లో ఆందోళన
Recommended Video
విశాఖపట్టణం:ఇటీవలి కాలంలో వరుస ప్రతికూల పరిణామాలు వైసిపి ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అయితే అందులో పార్టీ అధినేతతో సహా ఆ పార్టీల నేతల స్వయంకృతాపరాధాలే ఎక్కువ. ఫలితంగా కీలక సమయంలో వైసిపి అప్రతిష్ట పాలవుతుండగా....మరోవైపు వీటి ప్రభావం ఆ పార్టీ అధినేత జగన్ పాదయాత్ర పైనా పడుతోంది.
ఇప్పటివరకు జనాల రాకడ విషయంలో ఆరోహణ క్రమంలో సాగిన జగన్ పాదయాత్ర ఇటీవలి కాలంలో ఒడిదుడుకులు చవిచూస్తుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పైగా తానొకటి తలిస్తే దైవం మరోటి తలచినట్లుగా పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ చేపట్టిన పాదయాత్ర ఆయా ప్రాంతాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు తీవ్రతరమవడానికి కారణమై పార్టీ పరువు...అధినేత పరువు వీధినపడేస్తుండటమే కొసమెరుపు.
జగన్ పాదయాత్రలో...జగడాలు
ప్రజాసంకల్పయాత్ర పేరిట ప్రతిపక్ష పార్టీ వైసిపి అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే పది జిల్లాల్లోపూర్తికాగా...చివరి ఘట్టంగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో పాదయాత్రకు ఈ నెల 14న జగన్ శ్రీకారం చుట్టారు. విశాఖ జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గంలోని గన్నవరం మెట్ట వద్ద నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. జగన్ నియోజకవర్గంలో వారం రోజులు పాదయాత్ర నిర్వహించి, సోమవారం ఉదయం పాయకరావుపేట నియోజకవర్గంలో అడుగుపెట్టారు. తన పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల,పార్టీ సమస్యలు తెలుసుకుని తాము అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వారికి వివరించేందుకు జగన్ ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
కాని...వాస్తవంలో వేరు
కానీ వాస్తవంలో కొన్ని నియోజకవర్గాల్లో అందుకు భిన్నంగా జరుగుతోంది. పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు, విభేదాలు జగన్ లక్ష్యాన్ని దెబ్బతీసేవిధంగా పరిణమిస్తున్నాయని ఆ పర్టీకి చెందిన మరికొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో జగన్ పాదయాత్రకు ముందు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లోనే తీవ్రస్థాయిలో నాయకుల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా వున్న అభిప్రాయ భేదాలు తీరా పార్టీ అధినేత చేరువ కాగానే ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి.
గొడవ 1...దృశ్యాల తొలగింపు
శనివారం పాయకరావుపేట వైసిపి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం కోటవురట్ల మండలం తంగేడులో జరిగింది. ఆ సమావేశంలో పార్టీ కోటవురట్ల మండల అధ్యక్షుడు పైలా రమేష్కు, తంగేడు రాజులకు మధ్య వున్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. విజయసాయిరెడ్డి సమక్షంలోనే పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రంగా గొడవపడడం గమనార్హం. ఈ వైసీపీ నాయకుల గొడవను చిత్రీకరించిన పత్రికా విలేఖరుల వద్ద నుంచి విజయసాయిరెడ్డి వర్గీయులు కెమెరాలు లాక్కొని బలవంతంగా ఆ చిత్రాలను తొలగించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గొడవ 2...జగన్ నే లాగేశారు
అదేక్రమంలో ఆదివారం జరిగిన ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో వైసీపీ నాయకులు కన్నబాబురాజు, బొడ్డేడ ప్రసాద్ ఇరువురూ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో విజయసాయిరెడ్డి ఖంగుతిన్నారు. వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా పార్టీ అధినేత జగన్ను కూడా ఈ రొచ్చులోకి లాగేయడం గమనార్హం. తాను ఆయనకు భారీగా డొనేషన్ ఇచ్చానంటూ కన్నబాబురాజు పేర్కొనడం సంచలనం సృష్టించింది.
సర్దుబాటు చర్యలు...సఫలం అయ్యేనా?
తమ మధ్య విభేదాలతో పార్టీ నాయకులు సాక్షత్తూ పార్టీ అధినేతనే రొచ్చులోకి లాగేయడంతో విజయసాయి రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలంతా దిగ్బ్రాంతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ గొడవల ఫలితమో...గ్రూప్ రాజకీయాల తాకిడో గాని జగన్ పాదయాత్ర మీద ప్రభావం చూపుతున్నట్లు పార్టీ నేతలు విశ్లేషించుకున్నారని సమాచారం. వీటి నుంచి త్వరగా తేరుకోకుంటే జరిగే నష్టాన్ని అంచనా వేసిన పార్టీ ముఖ్య నేతలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వైసీపీలో విభేదాలు లేవని, అంతా మీడియా సృష్టి అని, కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ ఈ నెల 13న నర్సీపట్నంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఈ విభేదాలను సీరయస్ గా పరిగణించి జగన్ రాకకు ముందే సర్దుబాటు చేసేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి ఆ చర్యలు ఏమేరకు సత్ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి.