ఎపి ఉద్యోగులకు శుభవార్త...11వ పీఆర్సీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ నేడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంఘం అన్ని అంశాలను పరిశీలించి ఏడాదిలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.
దీంతో ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రలోని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ అంశానికి సంబంధించి ఉత్తర్వులు కూడా విడుదల కావడంతో ఉద్యోగ సంఘాలు ఊరట చెందాయి. అయితే నివేదికకు ఏడాది గడువు విధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
10 వ పిఆర్సీ...బకాయిలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన పదో పిఆర్సీ ఎరియర్స్ అంశంపై ఉద్యోగ సంఘాలతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ శాఖ సెక్రటరీ రవిచంద్ర సెక్రటరియేట్లోని ఆయన ఛాంబర్లో చర్చలు జరిపారు. పది నెలల పిఆర్సీ బకాయిల చెల్లింపుల గురించి ప్రధానంగా చర్చ జరిగింది. ఈ బకాయిల చెల్లింపులు మూడు విధాలుగా ఉంటాయని తెలిసింది. చర్చల్లో ప్రధానంగా విశ్రాంత ఉద్యోగులు, సర్వీస్లో ఉన్న ఉద్యోగుల్లో పాత పెన్షన్ విధానం అమలవుతున్న ఉద్యోగులు, సర్వీస్లో ఉన్న ఉద్యోగుల్లో సిపిఎస్ విధానం అమలువుతున్న ఉద్యోగుల గురించి చర్చించారు.
పిఆర్సీ కోసం నిరీక్షణ
రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను తెలుగుదేశం ప్రభుత్వం గాలికోదిలేసిందని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నూతన పిఆర్సీ సంఘాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి వాటిని పరిష్కారించాల్సిన ఆశోక్బాబు ప్రభుత్వానికి డబ్బా కొడుతూ సొంత వ్యాపకాలతో కాలం గడుపుతున్నట్లు వైసిపి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
బకాయిలు...చెల్లించలేదు
అయితే 11వ పీఆర్సీ ఏర్పాటు చేయాలంటే ముందుగా 10వ పిఆర్సీ బకాయిలను చెల్లించాలని కోరినట్లు కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వద్ద తగినంత డబ్బు లేనందున చెల్లించలేమని చెప్పారని, ఇప్పటికే రెండు డిఏలు కూడా ఇవ్వాల్సి ఉందని దానిపై కూడా ప్రభుత్వంపై స్పందన లేదనేది ఆ ఉద్యోగ సంఘాల ఆవేదన.
చర్చించి...నిర్ణయం
11 వ వేతన సవరణ సంఘం ఏర్పాటుపై ఉద్యోగ సంఘాలు చర్చించి విధివిధానాల మార్పుచేర్పులపై చర్చించి తమ అభిప్రాయాన్ని ప్రకటిస్తామని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు చెబుతుండటం గమనార్హం. దీంతో ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు ఎలా స్పందించనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.