ఎపి ప్రభుత్వం వినియోగిస్తున్న సాంకేతికత,సంస్కరణలు కేంద్రం కూడా అమలు చేయాలి:అమెరికా రాయబారి సూచన
అమరావతి: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని పలు పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయని భారత్లోని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ చెప్పారు. ఆయన మంగళవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రియల్టైమ్ గవర్నెన్స్ విధానం, వివిధ రకాల పౌర సేవలను ఇంటిగ్రేటెడ్ చేస్తున్న తీరు, ఈ-ప్రగతి, సర్వీసుల్లో సాంకేతికత వినియోగం తదితర అంశాలను అమెరికా రాయబారి జస్టర్కు వివరించారు. అనంతరం ఈ విషయమై స్పందించిన జస్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికతను వినియోగించుకుంటున్న తీరు, ప్రవేశపెట్టిన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వమూ అమలు చేయాలని సూచించారు.
అమెరికా రాయబారి...ప్రశంసలు
భారత్లోని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎపిలో అమలు చేస్తున్న టెక్నాలజీ , రిఫార్మ్స్ గురించి అమెరికా రాయబారి కెన్నత్ జస్టర్కి వివరించారు. ఈ సందర్భంగా కెన్నెత్ జస్టర్ మాట్లాడుతూ ‘‘ఏపీలో సమర్థవంతమైన నాయకత్వం ఉంది...మీరు మంచి పనితీరు కనబరుస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించారు... అందుకే అమెరికాలోని పలు పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ పై ఆసక్తి కనబరుస్తున్నాయి ''..,అని చంద్రబాబును అభినందించారు. ఏపీ ప్రభుత్వం సాంకేతికతను వినియోగించుకుంటున్న తీరు, ప్రవేశపెట్టిన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వమూ అమలు చేయాలని కెన్నెత్ జస్టర్ సూచించారు.
ఉండవల్లి గుహలు...సందర్శన
అనంతరం అమరావతిలో వారసత్వ మ్యూజియాన్ని, ఉండవల్లి గుహలను అమెరికన్ రాయబారి కెన్నెత్ జస్టర్ సందర్శించారు. ఉండవల్లి గుహల వద్ద కెన్నత్ కు ఏపీ పర్యాటక అధికారి మల్లికార్జున్ స్వాగతించగా...పురావస్తు శాఖాధికారి శ్రీరాములు గుహల విశిష్టత, చారిత్రక విషయాలను ఆయనకు వివరించారు. బౌద్ద చరిత్ర గురించి విన్నానని...ఇప్పుడు అందుకు ప్రత్యక్ష సాక్షాలు చూస్తున్నట్లు ఈ సందర్భంగా కెన్నెత్ జస్టర్ పేర్కొన్నారు.
ఎపిలో...ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు
మరోవైపు ఎపిలోని ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు...అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకాల వివరాలు సేకరించేందుకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు మంగళవారం అమరావతికి చేరుకున్నారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు వారు పర్యటించనున్నారు. తొలిరోజు విజయవాడ ప్రకాశ్నగర్లోని సిఎం ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మెడాల్ మదర్ ల్యాబ్, ముఖ్యమంత్రి ఈ-ఐ కేంద్రాన్ని సందర్శించారు. తర్వాత ఏలూరులోని జిల్లా ఆస్పత్రిని పరిశీలించారు.
నిధుల కేటాయింపు...కీలకం...
బుధ, గురు వారాల్లో ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు ఎపి ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, అధికారులతో భేటీ జరుగుతుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖలో కీలకమైన మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.3500 కోట్ల వరకూ ప్రపంచ బ్యాంక్ నుంచి పొందేందుకు ఎపి కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీకి ప్రపంచ బ్యాంక్ నిధులు కేటాయించే సందర్భంలో బుధ, గురువారాల్లో జరుగనున్న భేటీలు అత్యంత కీలకమైనవని రాష్ట్ర ఆరోగ్యశాఖ భావిస్తోంది.