మీ సీఎంకు అరెస్ట్ వారెంట్ జారీ...నాందేడ్ ఎస్పీ లేఖ;కోర్ట్ వారెంట్ ఏదీ?:డిజిపి ఆఫీసు ప్రత్యుత్తరం
అమరావతి:"మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధర్మాబాద్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ జారీ అయింది"...అని డీజీపీ ఆర్పీ ఠాకూర్ పేరిట మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ఎస్పీ రాసిన ఒక లేఖ ఎపి డిజిపి ఆఫీస్ కు చేరింది.
అయితే ఉద్దేశ్యపూర్వకంగానో...లేక మరచిపోయారో తెలియదు కాని నాందేడ్ ఎస్పీ ఆ లేఖతో పాటు ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ కాపీని మాత్రం జతచేయలేదు. దీంతో ఆ వారెంట్ ఏదీ?...అంటూ అని ప్రశ్నిస్తూ ఎపి డీజీపీ ఆఫీస్ ప్రత్యుత్తరమిచ్చింది. ఆ వారంట్ ను పంపించాలంటూ నాందేడ్ ఎస్పీకి ప్రత్యుత్తరంతో కూడిన లేఖను పంపించారు.
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై బాబ్లీ ప్రాజెక్ట్ వివాదంలో కేసు నమోదు కుట్ర పూరితమని, దీనిపై మహారాష్ట్ర గవర్నర్ ను కలవనున్నట్లు టిటీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గట్టు ప్రసాద్బాబు ప్రకటించడం ఎపి రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. జనగామలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సహా 16 మందిపై మహారాష్ట్ర పోలీసులు నమోదు చేసిన క్రైమ్ నంబర్. 67/2010 కేసు కుట్రపూరితమేనని అన్నారు.
బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన సమయంలో చంద్రబాబుతోసహా పలువురిని అక్కడి పోలీసులు రెండురోజులపాటు నిర్బంధించి తిరిగి హైదరాబాద్కు పంపించారని, నాటి కేసులన్నీ క్లోజ్ అయినప్పటికీ మళ్లీ కొత్తగా కేసులు నమోదుచేసి నాన్బెయిలబుల్ వారంట్ జారీచేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. బాబ్లీ ప్రాజెక్టుకు గేట్లు బిగించకుండా అడ్డుకున్నది టీడీపీ మాత్రమేనని చెప్పారు.
తక్షణమే సుప్రీం కోర్టు జడ్జీతో వారంటుపై న్యాయవిచారణ జరిపించాలని, తెలంగాణలోని ఎస్ఆర్ఎస్పీని కాపాడాలంటే వెంటనే ఒక కమిటీని వేసి బచావత్ అవార్డు మేరకు నివేదిక తయారు చేయాలని ఈ సందర్భంగా తెలంగాణా టిడిపి నేతలు డిమాండ్ చేశారు. అలాగే చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీపై ఈనెల 23వతేదీ తర్వాత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావును టీ టీడీపీ ప్రతినిధి బృందం కలవనుందని తెలిపారు. ఇప్పుడు ఈ అంశం ఎపిలో హాట్ టాపిక్ గా మారింది.