బొంగు చికెన్ దొరకడం లేదు...పర్యాటకుల అసంతృప్తి:కారణం ఇదే!
తూర్పుగోదావరి:తూర్పుగోదావరి లోని ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి...పర్యాటక ప్రాంతమైన ఈ మారేడుమిల్లి పేరు వింటేనే భోజన ప్రియులకు ఠక్కున ఒక వంటకం గుర్తుకు వస్తుంది...అవును...ఆ వంటకం పేరు బొంగు చికెన్..దీన్నే బాంబూ చికెన్ గా కూడా పిలుస్తారు...మారేడుమిల్లికి వచ్చిన పర్యాటకులు బొంగులో చికెన్ ను కూరి వండి వడ్డించే ఈ ప్రత్యేకమైన వంటకాన్ని రుచి చూడకుండా వెళ్లరంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ఈ వంటకం ఇక్కడ అంతగా ఫేమస్ అయింది కాబట్టే కేవలం ఈ బొంగు చికెన్ తినేందుకే ఇక్కడకు అనేకమంది వస్తుంటారు. దీంతో ఇక్కడ సుమారు 40 కుటుంబాలు బొంగు చికెన్ తయారితో ఉపాధి పొందుతున్నారు. అయితే హఠాత్తుగా ఇక్కడ ఇప్పుడు బొంగు చికెన్ తయారీకి బ్రేక్ పడింది. దీంతో బొంగు చికెన్ తయారీ చేసేవారు ఉపాధి కోల్పోగా తమకు ఇష్టమైన వంటకం లభించగా పర్యాటకులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే?...
అటవీ శాఖ...ఆంక్షలు...
అటవీ శాఖ హఠాత్తుగా పెట్టిన ఆంక్షల కారణంగా ఇక్కడి బొంగుచికెన్ దుకాణాలన్నీ ఒక్కసారిగా మూతపడ్డాయి. బొంగు చికెన్ ని తయారు చేసేటప్పుడు వెదురు బొంగులను ఉపయోగించడం ద్వారా...అడవులకు నష్టం కలుగుతుందని అటవీశాఖ అధికారులు దీని తయారీపై ఆంక్షలు పెట్టారు. బొంగులు తెచ్చినా, బొంగుచికెన్ తయారు చేసినా కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఆదాయం కోసమా?...అందుకేనా
అయితే అటవీ శాఖ అధికారులు ఈ బొంగు చికెన్ తయారీదారులకు ఒక వెసులుబాటును ఇచ్చారు. ఈ బొంగు చికెన్ తయారు చేసేందుకు అనుమతి కావాలంటే ఒక్కొక్క దుకాణానికి నెలకు 2500 రూపాయిల చొప్పున అటవీశాఖకు అపరాధ రుసుం చెల్లించాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నెలకు అంతంత చొప్పున డబ్బు కట్టి వీటి తయారీని కొనసాగించలేమని, నెలకు వెయ్యి చెల్లించడమే కష్టమని తయారీదారులు అంటున్నారు. అందుకే తయారీనే నిలిపివేశారు.
గతంలోనూ...ఇలాగే
గత ఏడాది నవంబరులోనూ ఇదే విధంగా అటవీశాఖ అధికారులు బొంగుచికెన్ దుకాణాలను హఠాత్తుగా మూయించివేశారని తయారీదారులు చెబుతున్నారు. అప్పట్లో ఒక్కొక్క దుకాణానికి 3 వేలు చొప్పున అపరాధ రుసుం చెల్లిస్తే తయారీని కొనసాగించేందుకు అంగీకరించారని...అయితే ఈ బొంగు చికెన్ తయారీదారులు ఇటీవల కాలంలో తరువాత చెల్లించడం నిలిపివేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు ఇదే విషయమై ఆంక్షలు విధించడంతో బొంగులో చికెన్ తయారీకి మళ్లీ బ్రేక్ పడింది.
పర్యాటకుల అసంతృప్తి
అటవీ శాఖ అధికారుల ఆంక్షలతో బొంగు చికెన్ తయారీ చేసేవారు ఉపాధి కోల్పోవడంతో పాటు పర్యాటకులు కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. హోటళ్లు అంతగా అందుబాటులో ఉండని ఇక్కడ ఈ బొంగుచికెన్ తయారీదారుల వద్దే ఆహార పదార్థాలు లభ్యం అవుతాయని, తద్వారా తమ ఆహార అవసరాలు తీరతాయని పర్యాటకులు అంటున్నారు. బొంగు చికెన్ తయారీ దారులపై ఆంక్షలతో ఇక్కడ ఆహారం లభించడమే కష్టతరమవుతోందని అంటున్నారు. అయినా చిరు వ్యాపారులను ఆదాయ వనరులుగా చూడటం అటవీశాఖకు తగదని వారు అభిప్రాయపడుతున్నారు.