ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు..! మూడురోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు..!!
విజయవాడ/ హైదరాబాద్ : గుణదల మేరీ మాత ఉత్సవాలు నేడు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావుతో పాటు పలువురు చర్చి ఫాదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను లాంఛనంగలా ప్రారంభించారు. శనివారం జరిగిన ప్రార్థనల్లో వందలాది మంది పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమిష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్య ప్రసాదాన్ని అందజేశారు. మేరీమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు గుణదల చేరుకుంటున్నారు. బిషప్ గ్రాసి పాఠశాల ద్వారా కొండ పైకి చేరుకుని మేరీమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా విజయవాడ కేథలిక్ పీఠాధిపతి డాక్టర్ తెలగతోటి రాజారావు భక్తులనుద్దేశించి శాంతి సందేశం అందించారు.
ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు గుణదల మేరిమాత ఉత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు. గుణదలతో పాటు గుణదల కొండ, చర్చితో పాటుపరిసర ప్రాంతాలు అన్ని విద్యుత్ కాంతులతో కళ కళలాడుతున్నాయి. ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు గుణదల పుణ్యక్షేత్రం నిర్వాహకులు, ఉత్సవ నిర్వాహకులు ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు తెలిపారు. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత దేశం నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు రానున్నారని ఈసందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సుమారు పది లక్షల మందికిపైగా యాత్రికులు రానున్నారని వారికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.