దాడి రోజు మావోల తీరు:అతడేమో కఠినం...ఆమె చేతిలో ఎకె47,మెడలో బుల్లెట్ల దండ
విశాఖపట్టణం:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కాల్చివేత ఘటన రోజు ఏం జరిగిందనేది పోలీసులకు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజనల్ కమిటీ (సీఆర్సీ) ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఆ రోజు దాడి సమయంలో మావోయిస్టుల తీరు ఇలా ఉంది...హిందీలో మాట్లాడుతున్న ఒక మావోయిస్టు నేత ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించాడు. అతడి మాట తీరు, ప్రవర్తన చాలా కఠినంగా ఉంది. ఇక మహిళా మావోయిస్ట్ అరుణ మెడలో బుల్లెట్ల దండ ధరించి చేతిలో ఏకె 47 పట్టుకున్నట్లు తెలిసింది. మావోయిస్టులు మంత్రి లేదా అధికార పార్టీ ఎమ్మెల్యేను చంపి సంచలనం సృష్టించాలనే నిర్ణయం మేరకు ఈ దాడి లక్ష్యంగా పెట్టుకున్నారు.
నందాపూర్-నారాయణపట్నం ఏరియా కమిటీ ఉమ్మడిగా ఈ ఆపరేషన్ నిర్వహించిందని పోలీసుల విచారణలో తేలిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల ఉనికే లేదన్నట్లుగా పరిస్థితి తయారైందని...ఏదేని గట్టి టార్గెట్ చేధించడం ద్వారా ఉనికి చాటుకోవాలని గత కొంతకాలంగా మావోయిస్ట్ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రానికి చెందిన మంత్రి లేదా అధికార పార్టీ ఎమ్మెల్యేను చంపితే ఆ సంచలనం ప్రస్తుతానికి తమ ఉనికిని చాటడానికి సరిపోతుందని మావోయిస్టులు భావించారు.
ఆ క్రమంలో ఎమ్మెల్యే కిడారిని వారు తొలి టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నారు. ఆయనపై గత నెల 21వ తేదీనే దాడి చేసేందుకు పథకం పన్నినా...అదే రోజు పాడేరు సీఐ 14 మంది గ్రేహౌండ్స్ పోలీసులతో ఆ మార్గంలో వెళ్లడం చూసి మావోయిస్టులు అలెర్ట్ అయ్యారు. ఆ తరువాత రోజు గ్రేహౌండ్స్ బలగాలు వచ్చినా ఎదుర్కొని టార్గెట్ పూర్తి చేసేలా దాడికి సిద్ధమయ్యారు. అందుకే బుల్లెట్ గాయాలు తగిలినా చికిత్స చేసుకునేందుకు అవసరమైన కిట్లు కూడా వెంట తెచ్చుకున్నారు.
ఈ క్రమంలో ఆదివారం లిప్పిటిపుట్టులో ఎమ్మెల్యే కిడారిపై జరిగిన దాడిలో సుమారు 70 మంది మావోయిస్టులు పాల్గన్నారు. వీరిలో నలుగురు ఐదుగురు మినహా అందరూ సాధారణ దుస్తుల్లోనే ఉన్నారు. వీళ్లలో 8 మంది వద్ద ఏకే 47 రైఫిల్లు ఉన్నాయి. ఇక ఆపరేషన్ కు నేతృత్వం వహించిన అరుణ ఏకే 47 రైఫిల్తోపాటు, మెడలో బుల్లెట్ల దండ(అమ్యునేషన్ చెయిన్) ధరించింది. దాడి సందర్భంగా అరుణ ఒడియాతో పాటు గిరిజన భాషలో మాట్లాడిందని...విప్లవం గురించి స్థానికులకు వివరించిందని తెలిసింది.
అయితే గత దాడులకు భిన్నంగా ఈ ఆపరేషన్ లో మావోయిస్టులు ఎలాంటి కంగారు లేకుండా ధీమగా కనిపించడంతో పాటు పక్కా ప్రణాళికతో ఎటువంటి తడబాటు లేకుండా టార్గెట్ పూర్తిచేసుకొని వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక మావోయిస్టులు ఈ దాడిలో వినియోగించిన ఆయుధాలు ఒడిశాలోని దామన్జోడ్ ఆయుధాగారంపై దాడి చేసి ఎత్తుకొచ్చినవేనని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.