ఎపికి అతిపెద్ద ఆస్థి అమరావతి...10 ఎకరాల్లో భారీ షాపింగ్ మాల్
అమరావతి:తాను సమకూర్చుకుంటున్న అద్భుత శక్తిసామర్థ్యాల ద్వారా రాబోయేకాలంలో రాష్ట్రానికే అతి పెద్ద ఆస్తిగా రాజధాని అమరావతి నిలవబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణంపై వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ఏపీ సీఆర్డీయే, ఏడీసీ తదితర సంస్థలు, విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాదిన్నరలో అమరావతికి కొత్తగా సుమారు 38,000 కుటుంబాలు రానున్నాయని, అలాగే వ్యాపార, పర్యాటక తదితర కార్యకలాపాల నిమిత్తం వేలాదిమంది రాకపోకలు సాగించనున్నారని సిఎం చెప్పారు. వీరందరి సంఖ్య అంతకంతకూ పెరిగి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి బ్రహ్మాండమైన ఆర్థిక శోభ రాబోతుందని చంద్రబాబు వివరించారు.
తగినట్లుగా సన్నద్దం...ఆదేశం
రాబోయే కాలంలో అమరావతి అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మౌలిక వసతుల కల్పన, నిధుల సమీకరణ జరపాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిలో నూతనంగా వేయబోయే పైప్లైన్, తాగునీరు, మురుగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్ వీటన్నింటిలో లేటెస్ట్ టెక్నాలజీ వినియోగించడం జరుగుతుందన్నారు. ఈ మౌలిక సదుపాయాలన్నీ ఉండే డక్ట్లను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని సముపార్జించుకోవడం సాధ్యపడుతుందన్నారు.
నిధుల సమీకరణ...ఇలా చేద్దాం
మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని నిర్మించేందుకు అవసరమైన రూ.51,208 కోట్ల నిధులు అవసరమని సిఎం చంద్రబాబు చెప్పారు. ఈ నిధుల సమీకరణ, నిర్వహణకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికపై అధికారులతో సిఎం సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏపీసీఆర్డీయే అధికారులు హడ్కోతో పాటు ఇతర ద్రవ్య సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందండం ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు గల అవకాశాలను సిఎంకు వివరించారు. రాష్ట్ర ప్రజలతోపాటు ఎన్నారైల నుంచీ బాండ్ల ద్వారా నిధుల సేకరించాలని తెలిపారు.
భూముల అమ్మకం ద్వారా...ఆదాయం
అమరావతిలో సీఆర్డీయేకు దక్కే భూములను దశలవారీగా విక్రయించడం ద్వారా రానున్న 20 సంవత్సరాల్లో రూ.35,226 కోట్ల నుంచి రూ.73,509 కోట్ల వరకు ఆదాయం సముపార్జించే అవకాశం ఉందని సిఆర్డీఏ అధికారులు అంచనా వేశారు. వీటిల్లో కమర్షియల్ భూములను 269 చదరపు గజాల నుంచి 5,574 చదరపు గజాల విస్తీర్ణంలో 6 విభాగాలు చేయడం జరుగుతుందన్నారు. 9380 ప్లాట్లలో రెసిడెన్షియల్ ప్లాట్లను ఒక్కొక్కటి 1000 చదరపు గజాలుగా విభజించి, విక్రయానికి పెట్టాలనుకుంటున్నట్లు వివరించారు. వీటికి అధిక ధరలు లభించేలా ఈ-వేలం వేస్తామని, ప్రతి ప్లాట్కూ విడివిడిగా వేలం ఉంటుందని సిఎంకు తెలిపారు.
10 ఎకరాల్లో...భారీ షాపింగ్ మాల్...
అమరావతిలో క్రమంగా పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు ప్రయోగాత్మకంగా వినూత్న విధానంలో 10 ఎకరాల్లో అత్యంత భారీ షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది. ఇందులో సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, ఫుడ్కోర్టులు, రిటైల్ షాపింగ్ వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. వీటితో పాటు స్ట్రీట్ మార్కెట్ను తలపించేలా, ఓపెన్గా ఉండే షాపింగ్ బజార్ కూడా ఉంటుంది. ఇందులోని షోరూంలు సంప్రదాయ కట్టడాలను తలపిస్తూ పైకప్పులు, గోడలతో ఉంటాయి. దీనిని సీఆర్డీయే నిర్మించాలని, తదనంతరం దాని నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని భావిస్తున్నారు.
హోటళ్లపై...చర్చ
రాజధానిలో స్టార్ హోటళ్లను ఏర్పాటు చేయడానికి వివిధ పేరున్న సంస్థలు పోటీపడుతున్నప్పటికీ...అవన్నీ నిర్మాణం జరిగి అందుబాటులోకి వచ్చేసరికి సుదీర్ఘ సమయం పట్టే దృష్ట్యా ప్రస్తుత అవసరాల కోసం తాత్కాలిక హోటళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో రాజధాని ప్రధాన రహదారుల వెంబడి కంటైనర్ హోటళ్ల ఏర్పాటుకు అనుమతులివ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ తరహా కంటైనర్ హోటళ్ల స్థాపనపై సిఆర్డిఏ విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ గ్రూపు ఐటీసీతో కలసి పని చేస్తోంది.