చంద్రబాబు యూరప్ ట్రిప్ నుండి వచ్చే లోపు అంతా అయిపోతుంది అన్న బీజేపీ నేత షాకింగ్ కామెంట్
Recommended Video
తెలుగు రాష్ట్రాల్లో బిజెపి మైండ్ గేమ్ కొనసాగుతుంది . చంద్రబాబు యూరప్ ట్రిప్ వెళ్ళినా చంద్రబాబును మాత్రం నిద్ర పోనివ్వటం లేదు. ఆయన తిరిగి వచ్చేసరికి టీడీపీ ఖాళీ అవుతుంది అని బీజేపీ నేత సంచాల వ్యాఖ్య చేసి ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ సృష్టించారు. ఇక మొన్నటికి మొన్న టీడీపీ చీలిపోతుంది అని చెప్పిన బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని స్పష్టం చేశారు .
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూరప్ ట్రిప్ నుంచి రాష్ట్రానికి వచ్చేసరికి ఏపీ ముఖచిత్రం మారిపోతుందన్నారు.తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతోపాటు కాంగ్రెస్, జనసేన పార్టీల నుంచి కూడా వలసలు ఉన్నాయన్న విష్ణు వర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలు వారసత్వ రాజకీయాల నుండి , బానిసత్వం నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. అందువల్లే చాలామంది టీడీపీ నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారని విష్ణు వర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి బిజెపి వైపు కొందరు నాయకులు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో బిజెపి ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తో పాటు పలువురు టీడీపీ నేతలతో బీజేపీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారన్న వార్తల నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యల ప్రాముఖ్యం పెరిగింది.