ఏపీలోనూ బీజేపీ మైండ్ గేమ్ .. టీడీపీ లో చీలిక వస్తుందని చెప్పి , చంద్రబాబుకు షాక్ ఇచ్చిన బీజేపీ నేత
తెలుగు రాష్ట్రాల్లో బిజెపి మైండ్ గేమ్ ప్రారంభించింది. ఇప్పటికే తెలంగాణపై కాన్సెంట్రేట్ చేస్తున్న బీజేపీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తుల తో పాటు, కాంగ్రెస్ పార్టీ నుండి, అటు టిడిపి నుండి వచ్చే నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇక ఏపీలో సైతం టిడిపిని టార్గెట్ చేసుకున్న బీజేపీ టిడిపిలో ఉన్న అసంతృప్తులకు గాలం వేసే పనిలో ఉంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి బిజెపి వైపు కొందరు నాయకులు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో బిజెపి ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపిలో తిరుగుబాటు వస్తుందని, తెలుగుదేశం పార్టీ చీలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. ఇక ఏపీ లోని మాజీ మంత్రులు, పార్టీ ముఖ్యనాయకులు, ఎమ్మెల్యేలు తమ పార్టీ అధినాయకత్వం తో చర్చలు జరుపుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఏపీ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్న రాజకీయ పార్టీ బిజెపి నేనని విష్ణువర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలను రాష్ట్ర ప్రజలు త్వరలోనే చూడనున్నారని ఆయన పేర్కొన్నారు.
బిజెపిలో చేరేందుకు చాలామంది నాయకులు సంప్రదిస్తున్నారని చెప్పిన విష్ణు వర్ధన్ రెడ్డి ఎవరిని పార్టీలో చేర్చుకోవాలో, ఎవరిని పార్టీలో చేర్చుకోవద్దో అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇక ఏపీ సీఎం జగన్ పైన వ్యాఖ్యలు చేసిన విష్ణు వర్ధన్ రెడ్డి ప్రత్యేక హోదా పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటైపోయిందని ప్రస్తుతం వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక హోదా పేరు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. జగన్ ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్తే అది కచ్చితంగా ఏపీ ప్రజలను మోసం చేయడమే అవుతుందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి అటు టిడిపి పై , ఇటు వైసిపి అధినేత జగన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి.