ప్రేమ పెళ్లి చేసుకున్నాడని...యువకుడి తల్లిపై అమ్మాయి బంధువుల అత్యాచారం
చిత్తూరు:మనుషుల్లో మానవత్వం కనుమరుగై మృగాళ్లుగా అవతరిస్తున్న వైనాన్ని నిదర్శనమీ ఘటన. తమకు ఇష్టం లేకున్నా అమ్మాయిని తీసుకెళ్లి ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కోపంతో వధువు తరుపు బంధువులు అమానవీయంగా ప్రవర్తించారు.
దీంతో ఆ అబ్బాయిపై కోపంతో అతడి తల్లిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడమే కాదు మూడు రోజులుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు బాధితురాలితో కొడుకుకు ఫోన్ చేయించి వెంటనే అమ్మాయిని తీసుకొని రాకుంటే మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడినవారు బంధువులే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే...
బాధితురాలి కథనం ప్రకారం...రేణిగుంట శివారు ప్రాంతానికి చెందిన ఒక యువకుడు (27), తమిళనాడులోని తిరుత్తణికి చెందిన తన దూరపు బంధువైన అమ్మాయి(16) ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఈ అమ్మాయి కుటుంబీకులకు ఈ విషయం తెలిసి ఆమెకి మరో యువకుడితో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ అమ్మాయి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తన ప్రేమికుడికి తెలపడంతో...అతడు రహస్యంగా వెళ్లి తన ప్రియురాలిని తీసుకొని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయిని బంధువుల యువకుడు తీసుకుపోవడంతో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబీకులు రేణిగుంటలోని యువకుడి ఇంటిపై దాడి చేశారు.
ఇంట్లో ఉన్న అతడి తల్లిని వాహనంలో తీసుకెళ్లిపోయి నీ కొడుకును అప్పగించమంటూ మూడు రోజుల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మర్యాదగా తమ కూతురిని తమకు అప్పగించి వెళ్లకపోతే మరిన్ని దారుణాలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయం మీ కొడుకుకు చెప్పమంటూ తల్లితో ఆ యువకుడికి ఫోన్ చేయించారు. ఆ తరువాత కొడుకు రాగానే తెచ్చి అప్పగించమని ఆమెని వదిలేశారు. దీంతో ఆమె జరిగిన దారుణంపై గాజులమండ్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా వారు సీరియస్ గా తీసుకోకపోవడంతో బాధితురాలు సోమవారం గ్రీవెన్స్ లో తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ విచారణకు ఆదేశించగా విషయం వెలుగులోకి వచ్చింది.