ఒక్క రాజధానికే దిక్కు లేదు ..33 కడతారా ? .. పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న రాజధాని రైతులు
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా చేసిన మూడు రాజధానులు ప్రకటన సందర్భంగా ఏపీలో రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇక ఇదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజధాని రైతులకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై రాజధాని రైతులు భగ్గుమన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై భగ్గుమన్న రాయలసీమ వాసులు: శవయాత్ర నిర్వహించిన విద్యార్థులు
3 కాకుంటే 33 కడతాం ... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజధాని ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తున్న సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిని మూడు చోట్ల కాకుంటే ముప్పై మూడు చోట్ల కట్టుకుంటామని,మూడు రాజధానుల వ్యాఖ్యలలో తప్పు ఏముంది అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు అమరావతిలో అంత భూమి అవసరం లేదని, అమరావతిలో రైతుల భూములను వెనక్కి ఇచ్చేస్తామని తెలిపారు.
అమరావతిలో ఆందోళనలు చేస్తుంది టీడీపీ కార్యకర్తలే అన్న పెద్దిరెడ్డి
రాజధానిలో భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికల ముందే జగన్ చెప్పారని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో టీడీపీ కార్యకర్తలే ఆందోళనలు చేస్తున్నారన్నారు. విశాఖలో ఇప్పటికే భూముల ధరలు పెరిగాయన్నారు. విశాఖలో భూములు కొన్నామని అనడం సరైంది కాదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఇక అమరావతిలో ఏర్పాటుచేసిన సచివాలయం తాత్కాలికమని చంద్రబాబే చెప్పారన్నారు.
పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం
మూడు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు మండిపడుతున్నారు. ఒక రాజధాని కట్టడానికి దిక్కులేదు 33 రాజధానులు కడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు.రాజధాని భూములు వెనక్కి ఇస్తామన్నా విషయం వైసీపీ మేనిఫెస్టో లో చెప్పలేదని వారంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటనతోనే సగం చచ్చిపోయామని, ఇప్పుడు వైసీపీ మంత్రులు వ్యాఖ్యలతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులపై రాజకీయాలు చేయొద్దని హితవు
రైతులపై రాజకీయాలు చేయొద్దని వారు హితవు పలుకుతున్నారు. అమరావతి లో ఏ పార్టీ జండా లేదని, ఉన్నవి అంతా ప్రస్తుతం నల్లజెండాలేనని రాజధాని రైతులు ఏపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు రాజధాని ప్రాంత రైతులకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోవాలని చెప్తున్న రైతులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరుగుతున్నారు.
ఢిల్లీ వరకైనా వెళ్లి పోరాడతాం అంటున్న రైతులు
గత ప్రభుత్వం తమ వద్ద నుండి భూముల సేకరణ చేసిన ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి భూములు ఇచ్చేస్తామని చెప్పడం మంత్రికి ఎలా సమంజసంగా అనిపిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేస్తే ఊరుకునేది లేదని, ఢిల్లీ వరకైనా వెళ్లి పోరాటం చేస్తామని రాజధాని ప్రాంత రైతులు మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రకటన, తాజాగా పెద్దిరెడ్డి వ్యాఖ్యలు రాజధాని రైతుల తీవ్ర అసహనానికి, ఆవేదనకు కారణమవుతున్నాయి.