ఆ అభియోగాలతోనే ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెలపై కేసు నమోదు
ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావుపై ఎట్టకేలకు రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు . టీడీపీ సీనియర్ నేతగానే కాకుండా మాజీ మంత్రిగా మంచి గుర్తింపు ఉన్న కోడెలపై కేసు అంటే ఓకే గానీ.. స్పీకర్ గా వ్యవహరించిన నేతపై కేసు అంటేనే అది ఒక మాయని మచ్చ అని చెప్పక తప్పదు. అది కూడా ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన వ్యవహారంలో కోడెలపై కేసు నమోదు కావడం నిజంగానే పెద్ద విషయం కిందే లెక్క. కోడెలతో పాటు 22 మంది టీడీపీ కార్యకర్తలపైనా కేసు నమోదు చేసిన గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీసులు ఈ కేసులో కోడెలను ఏ3గా పేర్కొన్నారు.
పోలింగ్ బూత్ లోకి వెళ్లి తలుపులు వేయించి బూత్ ను తన అధీనంలోకి తీసుకున్న కోడెల
ఈ కేసులో ఏం జరిగిందో గమనిస్తే స్పీకర్ గా వ్యవహరించిన కోడెల ఈ ఎన్నికల్లో మరోమారు సత్తెనపల్లి నుంచే టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.తన గెలుపు కోసం చాలానే కష్టపడ్డారు. ప్రచారంలో తనదైన మార్కుతో దూసుకెళ్లారు. చివరి దాకా ప్రచారాన్ని హోరెత్తించిన ఆయన పోలింగ్ రోజున తన నియోజకవర్గ పరిధిలోని ఇనుమెట్ల గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద హల్ చల్ చేశారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లిన కోడెల... ఏకంగా బూత్ తలుపులు మూసివేయించారు.
పోలింగ్ రోజు జరిగిన ఘర్షణకు కారణం కోడెల చర్యనే అంటున్న వైసీపీ
దాదాపు అరగంటకు పైగానే కోడెల బూత్ లోనే ఉండిపోయారు. అయితే అప్పటిదాకా సహనంతోనే ఉండిపోయిన ఓటర్లు వైసీపీ సానుభూతిపరులు ఆ తర్వాత కోడెలపై విరుచుకుపడ్డారు. బూత్ తలుపులు ఎలా మూస్తారంటూ ఏకంగా కోడెలపై దాడి చేశారు. ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించిన తీరుపైనా విమర్శలు రేకెత్తాయి. కోడెలపై దాడి చేశారన్న ఆరోపణల మీద వైసీపీకి చెందిన నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. పోలింగ్ బూత్ ను తన అధీనంలోకి తీసుకునేందుకు యత్నించిన కోడెలపై మాత్రం కేసు నమోదు చేయలేదు.
కోడెల పోలింగ్ బూత్ ను అధీనంలోకి తీసుకోవటంతో కేసు నమోదు
ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీని కూడా వేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేయగా... రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ కూ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై పరిశీలన చేసిన పోలీసు ఉన్నతాధికారులు కోడెలపై కేసు నమోదు చేయాలని తీర్మానించారు.
కేసులో కోడెలను ఏ 3 గా చేర్చిన పోలీసులు
దీంతో ఇనుమెట్లకు సమీపంలోని రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కోడెలతో పాటు 22 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోడెలను ఏ3గా చేర్చిన పోలీసులు... పోలింగ్ బూత్ ను స్వాధీనం చేసుకునేందుకు కోడెల యత్నించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.