ఏపీ భూసేకరణ బిల్లుకు... కేంద్రం లైన్క్లియర్:త్వరలో రాష్ట్రపతి ఆమోదానికి!
అమరావతి:రాష్ట్ర భవిష్యత్ అవసరాల దృష్ట్యా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ భూ సేకరణ బిల్లు-2017కు కేంద్రం నుంచి లైన్క్లియర్ అయింది. ఈ బిల్లును త్వరలో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నట్లు స్పష్టం చేసింది.
ఈమేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ అధికారులకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఏపీ అధికారులు స్పందిస్తూఈ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలతో సంతృప్తి చెందిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2017 నవంబర్ నెలలో ఈ బిల్లును ఎపి అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపగా అప్పటినుంచీ ఈ కీలక బిల్లు పెండింగ్ లోనే ఉండగా తాజాగా కేంద్రం ఆమోదం పొందటం గమనార్హం.
Recommended Video
2016లో...కేంద్రం ఆర్డినెన్స్
2013 భూసేకరణ చట్టంలోని అనేక క్లాజులను మినహాయిస్తూ కేంద్రం 2016లో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానిని చట్టరూపంలోకి తీసుకురాలేకపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలే తమ అవసరాలకు అనుగుణంగా భూసేకరణ చట్టం రూపొందించుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన అనంతర పర్యవసానాల ఫలితంగా ఎపి భవిష్యత్ విశాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "2017 ఏపీ భూసేకరణ బిల్లు"ను రూపిందించింది. గత ఏడాది నవంబర్ నెలలో ఈ "2017 ఏపీ భూసేకరణ బిల్లు" ను ఎపి అసెంబ్లీ ఆమోదించింది.
ఎట్టకేలకు...పెండింగ్ క్లియర్
ఎపి అసెంబ్లీ ఆమోదం కోసం పంపిన భూ సేకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి సమ్మతి కోసం పంపించింది. అయితే అది తొలుత కేంద్ర వ్యవసాయశాఖకు చేరడంతో అప్పటి నుంచీ అక్కడే పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ఓఎస్డి రాం ప్రసాద్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సత్యపాల్ చౌహాన్తో భేటీ అయ్యి 2017 ఏపీ భూసేకరణ బిల్లు విషయమై వ్యవసాయశాఖ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అత్యవసర సమావేశం...వివరణలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ బిల్లు గుజరాత్, తెలంగాణ చట్టాల్లో ఏ నిబంధనలు అయితే ఉన్నాయో వాటినే తమ బిల్లులోనూ చేర్చామని, అలాంటప్పుడు వాటిని ఆమోదించి తమ ఏపీ బిల్లును ఎందుకు నిలిపివేశారని సత్యపాల్ చౌహాన్ ను గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆయన ఈ సమావేశానికి హుటాహుటిన కేంద్ర వ్యవసాయశాఖ అధికారులను పిలిపించారు. అయితే వారు ఈ బిల్లులో కేంద్ర చట్టంలోని ఆహార భద్రత, సామాజిక ప్రభావం అంచనా వంటి క్లాజులను మినహాయించారని, అందుకే బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వివరించినట్లు తెలిసింది. అయితే కేంద్రమే గతంలో ఆ రెండు క్లాజులను ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయాన్నిఎపి రెవెన్యూ ఓఎస్డీ రామ్ప్రసాద్ గుర్తు చేశారు.
కేంద్రం నుంచి...లైన్ క్లియర్
అయితే గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల బిల్లులు తమ పరిశీలనకు పంపించకుండానే కేంద్ర హోంశాఖ ఆమోదించిన విషయాన్ని వ్యవసాయశాఖ అధికారులు ప్రస్తావించారు. ఎపి తాజా వివరణలతో తమ అభ్యంతరాలు క్లియర్ అయినందున త్వరలోనే తమ సమ్మతి తెలియజేస్తూ బిల్లును హోంమంత్రిత్వ శాఖకు పంపించివేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపినట్లు సమాచారం. ఆ బిల్లు తమవద్దకు రాగానే ఏ మాత్రం జాప్యం లేకుండా వెనువెంటనే రాష్ట్రపతి ఆమోదానికి పంపుతామని ఈ సందర్భంగా సత్యపాల్ చౌహాన్ ఎపి అధికారులకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిసింది.
రాష్ట్రపతి ఆమోదం...లాంఛనమేనా...
అయితే కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ కీలక బిల్లు రాష్ట్రపతి ఆమోదం లాంఛనంగా జరుగుతుందా?...ఇంకా ఏమైనా కొర్రీలు వేసే అవకాశం ఉంటుందా?...అనేది సందేహమే...రాజకీయ లబ్థే ప్రధానంగా మారిన నేటి పరిస్థితుల్లో ఏ పరిణామాన్ని ముందుగా ఊహించలేని స్థితిగతులు నెలకొని ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే పొరుగు రాష్ట్రం తెలంగాణా ఏ విధమైన నిబంధనలను అనుసరించి బిల్లు రూపొందించిందో అదే నిబంధనలతో ఎపి బిల్లు కూడా రూపొందినందున, ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందినందున ఎపి బిల్లు కూడా ఏ అవాంతరాలు తేకుండానే రాష్ట్రపతి ఆమోదం పొందుతుందని ఎపి ప్రభుత్వం విశ్వసిస్తోంది.