ఏపీపై సానుకూల పవనాలు .. ఉపాధి హామీ పెండింగ్ నిధులు 708 కోట్లు విడుదల చేసిన కేంద్రం
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నిధులను విడుదల చేస్తూ సహకారం అందిస్తుంది . కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఎపీపట్ల సానుకూల దృక్పధాన్ని కనబరుస్తున్నారు . అందులో భాగంగా ఏపీకి ఇవ్వాల్సిన నిధులను విడుదల చేస్తున్నారు.
సరుకుల కోసం రేషన్ షాప్ చుట్టూ తిరగడం కాదు.. సెప్టెంబర్ 1 నుండి ఇక నేరుగా మీ ఇంటికే!
ఉపాధి హామీ పెండింగ్ నిధులను విడుదల చేసిన కేంద్రం
పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి నిధులు విడుదల చెయ్యాలని కేంద్రం నిర్ణయం తీసుకుని రూ. 3వేల కోట్లను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిధులను నాబార్డు నుంచి విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఇక తాజాగా ఉపాధిహామీ పథకానికి సంబంధించి ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధుల్ని కూడా విడుదల చేసింది. రాష్ట్రానికి రావాల్సిన మొత్తం నిధుల్లో రూ.708 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
కేంద్రం నుండి రావాల్సిన నిధులు 2500 కోట్లు .. ప్రస్తుతం విడుదల చేసింది 708 కోట్లు
యూసీలనుపరిశీలించి ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. అసలు ఏపీకి 2500 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం 708 కోట్లు రిలీజ్ చేసింది. ఇక ఎన్నికలకు ముందు గత టీడీపీ ప్రభుత్వం కేంద్రానికి నిధులు విడుదల చెయ్యాలని పలుమార్లు విన్నవించింది. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు యూసీలను సమర్పించడంతో పాటు ఉపాధి హామీ పనులకు పెండింగ్లో ఉన్న నిధుల్ని విడుదల చేయాలని జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని, కార్యదర్శుల్ని కలిసి విన్నవించారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెండింగ్ లో ఉన్న బిల్లులు .. వైసీపీ పాలనలో రిలీజ్
అయితే యూసీలను పరిశీలించిన కేంద్రం.. ఎంతమేరకు పనులు జరిగాయో పరిశీలించి తాజాగా రూ.708.65 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఐదేళ్ల కాలంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా టిడిపి ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్న బకాయిలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న ప్రభుత్వం ఏపీ పైన ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని గత ప్రభుత్వం వేసిన ముద్రను చెరిపేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లుగా ప్రస్తుతం కనిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇప్పుడు వైసీపీ పాలనలో రిలీజ్ చేస్తుంది.