సీఎం జగన్ పాలనపై అయ్యన్నపాత్రుడు ఫైర్.. పిచ్చోడి పాలన కంటే అధ్వానమని కామెంట్
ఏపీ సీఎం జగన్ పై టిడిపి నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలో పాలన అధ్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించిన టిడిపి నాయకులు తాజాగా ఇసుక కొరత విషయంలో దీక్షకు దిగితే అరెస్టు చేయడంపై మండిపడుతున్నారు.
లోకేష్ కారణంగానే పవన్ టీడీపీకి దూరమయ్యారన్న టిడిపి నేత సంచలనం
ఏపీలో నెలకొన్న తీవ్ర ఇసుక కొరతతో నిర్మాణరంగం కుదేలవుతుందని భావించిన టిడిపి నేతలు ఇసుక కొరత నిరసిస్తూ దీక్షలు చేపట్టారు. పోలీసులు ఎక్కడికక్కడ దీక్షను భగ్నం చేశారు. ఇక ఈ విషయంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీలో పిచ్చోడు కూర్చున్నా సీఎం జగన్ కంటే గొప్పగా పరిపాలించే వాడిని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పిచ్చోడిని కూర్చోబెట్టినా ఇంకా బాగా పాలిస్తాడేమోనని ఆయన పేర్కొన్నారు. ఇసుక కొరతను నిరసిస్తూ దీక్ష చేయడం తప్పా... దీక్షలు చేస్తే అరెస్ట్ చేస్తారా? అని అసహనం వ్యక్తం చేసిన అయ్యన్నపాత్రుడు గత ప్రభుత్వాలలో ఇలాంటి చర్యలకు ఎన్నడూ పాల్పడలేదని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఇక పోలీసులు సైతం తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించిన అయ్యన్నపాత్రుడు, తాము కూడా ప్రైవేట్ కేసులు వేస్తామని హెచ్చరించారు. వైసిపి అరాచక పాలన కు చరమగీతం పాడడానికి ఏపీ ప్రజలు ఇప్పటినుండే సిద్ధం అవుతున్నారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.