నేను లోకల్ ఎమ్మెల్యేని...నన్నే స్వామి వారి ఆలయంలోకి రానివ్వరా ?:తిరుపతి శాసనసభ్యురాలు ఆగ్రహం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం లోకి తిరుపతి ఎమ్మెల్యే సుగుణను అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. తాను స్థానిక ఎమ్మెల్యేనని...తననే ఆలయంలోకి అనుమతించకపోవడం ఏమిటని ఆమె ఆందోళనకు దిగారు.
మహాసంప్రోక్షణ సందర్భంగా ఆలయంలో జరిగే కార్యక్రమానికి హాజరవుదామని వస్తే ఆలయంలోకి అనుమతి లేదన్నారని ఎమ్మెల్యే సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ సభ్యురాలిగా ప్రొటోకాల్ కలిగిన తన పట్ల అధికారులు నిరాదరణ చూపారని, ఇది సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి, ప్రొటోకాల్ అధికారుల దృష్టికి తీసుకువెళతానన్నారు. వివరాల్లోకి వెళితే...
మహాసంప్రోక్షణ సందర్భంగా ఆలయంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు తిరుపతి ఎమ్మెల్యే సుగుణ బుధవారం మహాశాంతి తిరుమంజనం జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం 3 గంటలకు వైకుంఠం క్యూ కాంపెక్స్ వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడున్న సిబ్బంది ఎమ్మెల్యేను లోనికి అనుమతించకపోవటంతో ఆమె మహాద్వారం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను తిరుపతిలో పుట్టి పెరిగానని, వెంకన్న పరమభక్తురాలినని అయినా తనను లోపలికి అనుమతించకపోవటం ఏమిటన్నారు.
తన భర్త వెంకటరమణ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలో 2006లో జరిగిన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి తాము కుటుంబ సభ్యులం అందరం కలిసి పాల్గొన్నామని ఆమె గుర్తుచేశారు. అయితే ఈసారి టిటిడి అధికారులు మహాసంప్రోక్షణను ఎవరికీ చూసే అవకాశ మివ్వకుండా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తనను రమ్మని జేఈవో కార్యాలయం అధికారులు తెలిపారని, అయితే పంద్రాగస్టు కార్యక్రమాలు అధికంగా ఉండటంతో 3 గంటలకు క్యూకాంప్లెక్సు వద్దకు చేరుకోగా సిబ్బంది లోపలికి అనుమతించలేదని ఆమె వివరించారు.
అయితే తన ఆలయ ప్రవేశం విషయమై అధికారులతో మాట్లాడమని సిబ్బందికి చెప్పినా అధికారులు ఒప్పుకోవడం లేదని చెప్పి తిరస్కరించారన్నారు. నిజానికి శాసనసభ సభ్యురాలిగా ప్రొటోకాల్ కలిగిన తన పట్ల అధికారులు ఇలా నిరాదరణ చూపడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి, ప్రొటోకాల్ అధికారుల దృష్టికి తీసుకువెళతానన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన బోర్డు సభ్యులను అనుమతించి తనను నిర్లక్ష్యం చేయడమేమిటని ప్రశ్నించారు. గతంలో కూడా తన విషయమై పలుసార్లు ఇలాగే జరిగిందన్నారు.
తనను ఆలయంలోకి అనుమతించనందుకు ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే సుగుణ...తనకు జరిగిన అవమానంపై మహాశాంతి తిరుమంజనం అనంతరం 5.30 గంటలకు ఆలయం వెలుపలకు వచ్చిన టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్కు ఫిర్యాదు చేశారు. 'మీరు తిరుపతికి మాత్రమే ఎమ్మెల్యే తిరుమలకు కాదు అని రాసివ్వండి ఇకపై ఇటురాను' అని ఆమె మండిపడ్డారు. ఈ విషయమై టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పందిస్తూ పరిశీలిస్తామంటూ వెళ్లిపోయారు. మరోవైపు ఈవో అనిల్కుమార్ సింఘాల్ కూడా ఈ వివాదంపై ఏమీ మాట్లాడకపోవటం గమనార్హం.