శ్రీలక్ష్మి పిటీషన్ పై హైకోర్టు అభ్యంతరం - ఇద్దరు న్యాయమూర్తులపై : వైదొలగాలంటూ..!!
రాజధాని అమరావతికి సంబంధించి ఐఏఎస్ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజధాని వ్యాజ్యాలపై ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుంచి వైదొలగాలని కోరుతూ ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసారు. రాజధాని పైన దాఖలైన పిటీషన్ల పైన తీర్పు వెలువరించే సమయంలో హైకోర్టు ఈ పిటీషన్ పైనా స్పందించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరితమైన సిన్సియర్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ అంటూ అందులో పేర్కొన్నారు. నిజాయితీగా విధి నిర్వహణలో భాగంగా ఈ పిటీషన్ దాఖలు చేసారని వ్యాఖ్యానించింది.

ఇద్దరు న్యాయమూర్తులకు స్థలాలు ఉన్నాయంటూ
అమరావతి ప్రాంతంలో ఇద్దరు న్యాయమూర్తులకు ఇంటి స్థలాలు ఉన్నాయని, వ్యాజ్యాల్లో వచ్చే నిర్ణయం ఆధారంగా ఆ భూముల విలువ పెరగడం లేదా తగ్గే అవకాశం ఉందన్న కారణంతో విచారణ నుంచి వైదొలగాలని పిటిషన్లో పేర్కొన్నారని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. వీరిద్దరికీ మాత్రమే ఇళ్ల స్థలాలను రాయితీ ధరకు ఇవ్వలేదని మొత్తం 14 మంది జడ్జీలకు మార్కెట్ విలువ చెల్లింపునతో ఇచ్చారని న్యాయస్థానం గుర్తు చేసింది. స్థలాలకు మార్కెట్ విలువ చెల్లించి ఆ ఇద్దరు న్యాయమూర్తులు కొనుగోలు చేశారని స్పష్టం చేసింది.

అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు
2018 లో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి హైకోర్టుకు లేఖ రాసారని.. అందులో హైకోర్టు జడ్జిలకు, న్యాయాధికారులకు, హైకోర్టు ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం పై ప్రతిపాదనలు చేసారని పేర్కొంది. ఆ ప్రతిపాదనకు హైకోర్టు పరిపాలన కమిటీ ఆమోదం తెలిపింది. పరిపాలన కమిటీ నిర్ణయాన్ని పుల్ కోర్టు ఆమోదించిందని వివరించింది. ఇళ్ల స్థలం కొనుగోలు చేసిన 15 ఏళ్ల పాటు విక్రయించడానికి వీల్లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాజధాని వ్యాజ్యాలపై తీర్పు వెల్లడించినా ఇప్పటికిప్పుడు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశమే లేదని స్పష్టం చేసింది. హైకోర్టు జడ్జిలు రాజ్యాంగబద్ధ విధులు నిర్వరిస్తారన్న ధర్మాసనం... విధులను నిర్వర్తించేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది.

పిటీషన్ కొట్టివేత..కీలక కామెంట్స్
నివసించే ఇళ్లు, వినియోగించే కార్లతో పాటు తీర్పులపై సంతకాలు చేసేందుకు ఇచ్చే పెన్నులకూ ప్రభుత్వమే సొమ్ము ఇస్తుందని పేర్కొంది. కోర్టుల నిర్వహణకు ఆర్థిక వనరులు సమాకూర్చుతున్న రాష్ట్ర ప్రభుత్వమే ఇద్దరు జడ్జిలపై ఆరోపణ చేస్తూ విచారణ నుంచి వైదొలగాలని కోరడం ప్రధాన న్యాయమూర్తి అధికార విధుల్లో జోక్యం చేసుకోవడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రంలోకి చొచ్చుకుని రావడమేనని అభ్యంతరం తెలిపింది. ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తులను విచారణ నుంచి వైదొలగాలని కోరడం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమేనని హైకోర్టు తెలిపింది. ఇది సిగ్గమాలిన ప్రయత్నమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు విచారణ నుంచి వైదొలగాలంటూ ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది.