ఎపి:రాష్ట్రాన్ని వణికిస్తున్న రోగాలు...స్వైన్ఫ్లూ, డెంగీ విజృంభణతో జనాల బెంబేలు;అలెర్ట్ కాకుంటే పె
అమరావతి:రాష్ట్రంలో రెండు అతి ప్రమాదకరమైన రోగాలు విస్తరిస్తున్న వైనం ఇటు ప్రజలనే కాదు...అటు అధికారగణాన్ని వణికిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రాణాంతక వ్యాధులు స్వైన్ఫ్లూ, డెంగీ విజృంభణ గురించి మీడియాలో వార్తలే కాదు...అధికారక లెక్కలు సైతం నిర్థారిస్తున్నాయి.
ఎపిలో స్వైన్ ఫ్లూ బారిన పడినవారి సంఖ్య గురించి సాక్షాత్తూ సిఎం డాష్ బోర్డు వెల్లడిస్తున్న అంకెలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పైగా అన్ని రకాల పరీక్షల తరువాత వారు ఈ వ్యాధి బారిన పడినట్లు అధికారికంగా నిర్ధారించిన వారి సంఖ్యే ఇది. పైగా ఈ సంఖ్య కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి సంబంధించి మాత్రమేనంటే...ఇక ప్రైవేట్ హాస్పటల్స్ లో ట్రీట్ మెంట్ పొందే వారి సంఖ్య అదనమని అర్థం చేసుకోవాలి....డెంగీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వివరాల్లోకి వెళితే...
స్వైన్ ఫ్లూ...విజృంభణ
రాష్ట్రంలో ప్రమాదకర రోగాలు రాకుండా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా...సిఎం చంద్రబాబుతో సహా అత్యున్నత స్థాయి అధికారులు పదేపదే సమీక్షలు నిర్వహిస్తున్నా...ఫలితాలు మాత్రం నిరాశాజనకంగానే ఉన్నాయి. రోజురోజుకీ ఆ వ్యాధి ప్రబలుతుందన్న సంకేతాలు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి వెలువడుతున్నాయి. ఈ శుక్రవారం (19వ తేది) ఒకేరోజున రాష్ట్రంలో ఆరుగురు ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డారు. మరోవైపు ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధికారణంగా గడిచిన రెండు నెలల కాలంలో ఒక్క కర్నూలు జిల్లా లోనే ఆరుగురు మృతి చెందగా...విశాఖ లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని తెలిసింది.
బన్ని ఉత్సవం: ఈసారీ విరుచుకుపడ్డ కర్రలు, తీవ్రగాయాలు, లక్షలాదిగా తరలిన జనం
అనధికారం కాదు...అధికారిక లెక్కలే
స్వైన్ప్లూతో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన హేమలత (38) ఆదివారం మృతి చెందిన నేపథ్యంలో...ఇప్పటి వరకూ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆరుగురు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారని కర్నూలు అడిషనల్ డిఎంహెచ్ఓ సరస్వతిదేవి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం మీద జిల్లాలో ఇప్పటి వరకూ 13 కేసులను స్వైన్ప్లూగా నిర్ధారించినట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 20 టీమ్ లు అధికారుల వద్దకు వెళ్లి వారి ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. అలాగే 8 స్వైన్ ఫ్లూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.
మరో వైపు...డెంగీ విజృంభణ
మరోవైపు డెంగీ కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎపిలో అక్టోబర్ 5 నుండి 11వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా 57 డెంగీ కేసులు నమోదైతే, ఆ తరువాత డెంగీ బాధితుల సంఖ్య ఇంకా భారీగా పెరిగింది. అక్టోబర్ 18 వ తేది నాటికి అధికారిక సమాచారం ప్రకారమే రాష్ట్రంలో 106మంది డెంగీ వ్యాధి బారిన పడ్డారు. అనధికారికంగా వీరి సంఖ్య ఇంతకన్నా చాలా ఎక్కువ అనేది సుస్పష్టం. అంతేకాదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ఒక జడ్జీనే డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డెంగీ రోగనిర్ధారణ కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో పాటు...ప్రజల్లో అవగాహన పెంచడం, అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా మెలగాల్సిన ఆవశ్యకతను ఈ గణాంకాలు,ఉదాహరణలు తెలియచేస్తున్నాయి.
పల్లెల్లో కాదు...పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ
అయితే స్వైన్ఫ్లూ, డెంగీ కేసులు మారుమూల ప్రాంతాలు కాకుండా పట్టణ ప్రాంతాల్లోనే అత్యధికంగా నమోదవుతుండటం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక కేంద్రం విశాఖలో ఈ వ్యాధులు పెద్ద ఎత్తున విస్తరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. విశాఖ నగరంలో ఇటు స్వైన్ఫ్లూతో పాటు, అటు డెంగీ కూడా ఏకకాలంలో పెద్ద ఎత్తున వ్యాపించడం ఇక్కడివారికి భీతి కొలుపుతోంది. విశాఖ జిల్లాలో అక్టోబర్ నెల 12నుండి 18వ తేది వరకు నమోదైన 15 కేసులు...అన్నీ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనివే కావడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో ఏడుగురికి కొత్తగా స్వైన్ ఫ్లూ వ్యాధి సోకగా, వారిలో ఇద్దరు తిరుపతి నగరానికి చెందినవారు. కర్నూలులో నలుగురు ఈ వ్యాధి బారిన పడగా వీరిలో ఒకరిది కర్నూలు నగరం. విశాఖలో ఒక ఐపిఎస్ అధికారే ఈ వ్యాధి బారినపడటం గమనార్హం.
అధికారిక గణాంకాలు...ఇలా
అలాగే రాష్ట్రాన్ని వణికిస్తోన్న డెంగీ కూడా పట్టణ ప్రజలపైనే ప్రతాపం చూపుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో మూడు డెంగీ కేసులు ఈ నెల మొదటివారంలో నమోదుకాగా, 18వ తేదికి ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 63కు చేరింది. వీరిలో కాకినాడకు చెందినవారే 33 మంది...విశాఖ నగరంలోనూ 17 మంది డెంగీ బారిన పడ్డారు. అయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న ఈ వ్యాధుల విషయంలో సాధ్యమైనంత వరకు గోప్యత పాటించాలని ప్రభుత్వం వైద్యశాఖను ఆదేశించినట్లు తెలిసింది. అన్ని పరీక్షలు నిర్వహించిన తరువాతే వ్యాధిని అధికారికంగా నిర్ధారించాలని, అవసరమైతే తప్ప ప్రకటనలు చేయొద్దని...రోగ లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభించినప్పటికీ, నిర్ధారణ అయ్యేంతవరకు అధికారికంగా ప్రకటించవద్దన్నది ఈ ఆదేశాల సారాంశమని సమాచారం.