సీఎం జగన్ ఇక కఠినంగానే - ఉద్యోగులతో వాట్ నెక్స్ట్ : సిద్దంగా ప్రతిపక్షాలు - అస్త్రం అందిస్తారా..!!
ఏపీలో ఇప్పుడు పీఆర్సీ వ్యవహారం వివాదంగా మారుతోంది. ఉద్యోగ సంఘాల సమక్షంలో సీఎం జగన్ 23 శాతం పీఆర్సీ ప్రకటించారు. అందరూ హర్షించారు. తక్కువ అయినా ప్రస్తుత పరిస్థితుల్లో తప్పదంటూ సమర్ధించారు. అయితే, జీవోల జారీతో ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. అందులో హచ్ఆర్ఏ తగ్గించటం.. అలవెన్సులకు కోత పెట్టటంతో పాటుగా మరి కొన్ని అంశాల పైన ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. నిరసనలకు పిలుపునిచ్చాయి.
అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి పీఆర్సీ సాధన సమితిగా ఆవిర్భవించాయి. వచ్చే నెల 6వ తేదీ నుంచి సమ్మెకు సిద్దం అవుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ నాలుగు రోజులు నిరీక్షించినా.. ఉద్యోగ సంఘాల నేతల తమ సంఘంలోని సభ్యులను ఒక సారి లేఖ ఇచ్చి పంపారు.
చర్చలకు ఉద్యోగ నేతల షరతులు
వారు మాత్రం నేరుగా హాజరు కాలేదు. దీంతో..తొలుత సంయమనంతో కనిపించిన మంత్రులు..ఇప్పుడు పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం తాము డిమాండ్ చేసిన విధంగా మూడు అంశాల పైన స్పందిస్తేనే చర్చలకు వెళ్తామంటూ తేల్చి చెబుతున్నాయి. ఇదే సమయంలో ఆర్టీసీ..ఆరోగ్య శాఖ ఉద్యోగులు సైతం సమ్మెకు మద్దతుగా ముందుకొస్తున్నారు.
ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుంటోంది. వారు చర్చలకు రాకుండా.. ఇతర సంఘాల నేతలనూ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది. దీంతో..ఇక, ఉద్యోగ సంఘాల నేతలు ముందుకు వస్తేనే చర్చలంటూ మంత్రులు తేల్చి చెబుతున్నారు. పీఆర్సీ ప్రకారమే జనవరి జీతాలు ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జీతాల చెల్లింపు పై ప్రభుత్వం పట్టు
జీతాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీని పైన ట్రెజరీ ఉద్యోగ సంఘాల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తమకు సమయం కావాలని..ఉద్యోగుల ఎస్సార్ లు లేకుండా.. తాము ఏ పొరపాటు చేసినా..తమనే బాధ్యులను చేస్తారంటూ వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలంటూ సర్క్యులర్లు జారీ చేస్తోంది.
ఇదే సమయంలో ట్రెజరీ ఉద్యోగుల పైన చర్యలు తీసుకుంటే ఆ క్షణం నుంచే సమ్మెకు దిగుతామంటూ ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. మరో వైపు వర్సిటీ ఉద్యోగులు సైతం సమ్మె వైపు కదులుతున్నారు. దీంతో..ప్రభుత్వం ముందుగా జీతాల చెల్లింపు పైనే ప్రధానంగా ఫోకస్ చేసింది. ఆ విషయంలో అవసరమైతే కఠిన చర్యలకు వెనుకాడ కూడదనే భావనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ట్రెజరీలకు స్పష్టమైన ఆదేశాలు
ప్రభుత్వం ట్రెజరీలకు నిర్దేశించిన సమయానికి కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే తయారైనట్టు అధికారులు చెబుతున్నారు. ఇది మొత్తం 4.50 లక్షల బిల్లుల్లో పాతిక శాతం మాత్రమే. వీటిలో కూడా అత్యధికం పోలీస్శాఖ బిల్లులు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. ఇవి కాక వివిధ జిల్లాలకు సంబంధించిన బిల్లులు కూడా తయారయ్యాయి.
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్థికశాఖ జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా స్థాయిలో కొన్ని బిల్లులను తయారుచేశారు. జారీ చేసిన జిఓలను రద్దు చేస్తే చర్చలకు వస్తామని ఉద్యోగసంఘాలు చెబుతుండగా, ఆ పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. అదే సమయంలో చర్చల కమిటీలోని సభ్యుడైన ఒక మంత్రి ఉద్యోగులు వస్తే చర్చలు సాగుతాయి..లేదంటే చట్టం తన పనితాను చేసుకుపోతుంది అంటూ వ్యాఖ్యానించడం కూడా చర్చనీయాంశంగా మారింది.
అవసరమైతే చర్యలు తప్పవంటూ చర్చ
దీనికి తగ్గట్టే తమను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని జెఎసి నేతలు చెబుతుండటం సైతం వ్యవహారం ముదురుతోందనే సంకేతాలను ఇస్తోంది. అయితే 14 లక్షలకుపైగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో ఏ నిర్ణయం అయినా రాజకీయంగానూ ప్రభావితం చేసే అవకాశం అవకాశం ఉంది. ప్రతిపక్షాలు సైతం ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు మద్దతుగా నిలిచాయి. ప్రభుత్వం ఏ రకమైన చర్యలకు దిగినా..అది అధికార పార్టీ పైన రానున్న రోజుల్లో ప్రతికూల పరిస్థితులు చూపించే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో.. ఇప్పుడు అందరూ సీఎం జగన్ వైపు చూస్తున్నారు.
రాజకీయ కోణంలో జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
ఇప్పటి వరకు తన మూడేళ్ల పాలనలో కఠిన నిర్ణయాల దిశగా వెళ్లని సీఎం జగన్.. ఉద్యోగుల విషయంలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనే చర్చ సాగుతోంది. అదే సమయంలో ప్రభుత్వం ప్రతిపక్షాలకు రాజకీయంగా అవకాశం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటుందా అనే కోణంలో మరో చర్చ సాగుతోంది. ఇప్పుడు సీఎం జగన్ ఏం చేస్తారు... ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా అడ్డుకుంటారా...ప్రభుత్వం తనతంటగా తానే ప్రతిపాదనలతో ముందుకొస్తుందా.. ఉద్యోగ సంఘాలు వెనుకడుగు వేస్తాయా.. ఏం జరగబోతోంది. సున్నితంగా మారిన ఈ వ్యవహారం లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది.