సింప్లిసిటీకి సిసలైన నిర్వచనం...ఈ పీపుల్స్స్టార్
హైదరాబాద్: ఈ క్రింద ఫోటోలోని వ్యక్తిని గుర్తు పట్టారా?...ఏంటి జోకా?...అతన్ని గుర్తు పట్టని వారెవరైనా ఉంటారా?...ఇక వేళ ఉంటే...వారు బహుశా తెలుగు వాళ్లయి ఉండరు అనుకుంటున్నారు కదూ!...నిజమే...మీ ఆలోచన కరెక్టే...
ఎందుకంటే...మన తెలుగువాళ్లు ప్రేమతో పీపుల్స్ స్టార్ గా పిలుచుకునే ఈ ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తిని గుర్తుపట్టకుండా ఎలా ఉండగలం...అయితే ఈ ఫోటోలో ఆయన ఏం చేస్తున్నారు...ఎక్కడున్నారు...అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం వేళ అల్పాహారంగా ఏదో తింటున్నారు. అయితే ఇదేదో సినిమా షూటింగ్ అనుకునేరు కానే కాదు...ఆయన తన ప్రయాణంలో భాగంగా అక్కడ తినేసి మరెక్కడికో వెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు.
సినీ కథానాయకుడిగానే కాదు దర్శక నిర్మాతగా, సంగీత దర్శకుడుగా ఎన్నో సినిమాలు రూపొందించిన ఈ విలక్షణ నటుడు అత్యంత సాధారణమైన వ్యక్తిలా జీవిస్తాడనటానికి మనమిప్పుడు చూస్తున్న ఫోటోనే నిదర్శనం. ఈ విషయం ఆయనతో పరిచయం ఉన్న వాళ్లందరికీ తెలిసినా...ఇదిగో ఇలాంటి సందర్భాల్లో సామాన్య జనానికి కూడా తెలుస్తోంది.
మరోరకంగా చెప్పాలంటే ఆర్. నారాయణ మూర్తి స్థాయిలో ఉండి అంత సామాన్య జీవితం గడపడం సినీ నటుల్లో ఎవరికీ సాధ్యం కాదంటారు. తాను తీసిన సందేశాత్మక చిత్రాలకు అనుగుణంగానే ఆయన తన నిజ జీవితంలో ఎలాంటి ఆర్భాటాలకు, హంగులకు పోరు. చాలా సాధారణ వ్యక్తిలాగే ప్రజల్లో తిరుగుతుంటారు. అంతేకాదు ఒకే ఊర్లో వివిధ ప్రదేశాలకు వెళ్లాల్సివచ్చినప్పుడు అత్యధిక దూరం ఆయన నడిచే తిరుగుతారని చూసినవాళ్లందరూ చెప్పుకుంటారు. తప్పనిసరి అయితేనే ఆయన బస్సు, ఆటోల్లో అది కూడా మిగితా ప్రయాణికులతో కలసి సాధారణ తరగతుల్లోనే ప్రయాణిస్తారు.
దూర ప్రయాణాలైతే ఇదిగో ఇలా సామాన్య జనంలాగే ఆయన రైలు ప్రయాణాలు ఉంటాయి. ఇలా ఆర్.నారాయణ మూర్తిని చూసిన తోటి ప్రయాణికులు ఇలాంటి వాళ్లు ఇంకా ఉన్నారంటూ ఈ పీపుల్స్ స్టార్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు.