రెండు రోజుల పాటు కాలనాగులతో పోరాటం:బ్రతుకుపోరులో శునకందే విజయం
కృష్ణా జిల్లా: ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఓ శునకానికి లోపల మరింత ప్రమాదం ఎదురైంది. ఆ బోరు బావిలో అప్పటికే నివాసం ఉంటున్న రెండు పెద్ద తాచు పాములు ఈ శునకాన్ని కాటు వేసేందుకు ప్రయత్నించాయి.
ఒక్కొక్కటి పది అడుగుల పొడవున్న ఆ భారీ తాచు పాములకు తనను కాటేసే అవకాశం ఇవ్వకుండా శునకం అత్యంత క్లిష్టమైన బ్రతుకు పోరాటం మొదలు పెట్టింది. తిండీతిప్పలు లేకుండా అలా నీళ్లలోనే రెండు రోజులపాటు పోరాడుతూ ఆ కాలనాగులను నిలువరిస్తూనే ఉంది. చివరకు రెండు రోజులు గడిచాక ఒక రైతు ఈ కుక్క అరుపులు విని బావిలోకి తొంగి చూశాడు. పరిస్థితి అర్థం చేసుకొని ఆ కుక్క ను కాపాడాడు...అలా ఆ కుక్క తన జీవన పోరాటంలో విజేతగా నిలిచింది...వివరాల్లోకి వెళితే...
కృష్ణా జిల్లా పోరంకి లో ప్రియా ఫుడ్స్ పక్కనున్న కిలారు దిలీప్ పొలాన్ని ఈడ్పుగల్లుకు చెందిన కుసులూరి వెంకట ప్రసాద్ అనే రైతు కౌలుకి తీసుకొని అరటి సాగు చేస్తున్నాడు. ఆ పొలంలో ఒక బోరుబావి ఉంది. మంగళవారం రాత్రి ఆ బోరుబావిలో ప్రమాదవశాత్తు ఓ కుక్క పడిపోయింది. అయితే ఆ బావిలో ఎప్పటినుంచో రెండు పెద్ద త్రాచుపాములు నివాసం ఉంటున్నాయి.
దీంతో ఒక్కసారిగా తమ సామ్రాజ్యంలోకి వచ్చి పడిన ఆ కుక్కను మట్టుబెట్టేందుకు ఆ రెండు తాచు పాములు తీవ్ర ప్రయత్నాలు ఆరంభించాయి. ఆ కుక్కను కాటేసేందుకు విశ్వప్రయత్నం చేశాయి. అయితే ఈ కుక్క వాటికి తనను కాటేసే అవకాశం ఇవ్వకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ అలాగే నిలువరిస్తూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం కొనసాగిస్తూ వచ్చింది.
ఇలా ఆ కాల నాగులతో ఈ కుక్క పోరాటం రెండు రోజుల పాటు కొనసాగింది. కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆ బోరు బావి ఉన్న పొలాన్ని సాగు చేస్తున్న కౌలు రైతు కుసులూరి వెంకట ప్రసాద్ గురువారం పొలం పనికి వచ్చాడు. ఆ సమయంలో బావిలో నుంచి కుక్క అరుపులు విని వెళ్లి చూశాడు. లోపల పది అడుగులు పొడవున్న రెండు తాచు పాములు ఆ కుక్కపై కాటు వేసే ప్రయత్నం చేస్తుండటం చూసి అదిరి పోయాడు.
అయినా ఆ కుక్కని అలా వదిలివేయలేక తన వద్ద ఉన్న తాడు మోకుతో శ్రమించి ఆ శునకాన్ని బావి నుంచి బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అక్కడి వ్యవసాయ కూలీలు కూడా అక్కడకు చేరుకొని శునకం బయటకు రావడానికి ప్రసాద్ కు సహకరించారు. దీంతో ఆ కుక్క బావి నుంచి ప్రాణాలతో బైటపడింది. అంతేకాదు బ్రతుకు పోరాటంలో విజేతగా నిలిచింది.