మూడు రాజధానుల ప్రకటనపై చిరు వ్యాఖ్యల ఎఫెక్ట్ ..రాజధాని రైతుల్లో పవన్ కు పెరిగిన క్రేజ్
ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత, చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజధాని రైతులు ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటనను స్వాగతిస్తూ చిరంజీవి ప్రకటన చేయటం రాజధాని ప్రాంత వాసులకు ఏమాత్రం రుచించడం లేదు. ఒక పక్క జనసేన అధినేత చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజధాని రైతులకు బాసటగా నిలిస్తే అన్న సీఎం జగన్ కు వత్తాసు పాడటం రైతుల ఆగ్రహానికి కారణం అవుతుంది.
విశాఖను ఎగ్జిక్యూటివ్ కాపిటల్ చేయాలన్న నిర్ణయాన్నిస్వాగతించిన చిరంజీవి
విశాఖను ఎగ్జిక్యూటివ్ కాపిటల్ చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతించిన చిరంజీవి విశాఖలో రాజధాని ఏర్పాటుకు కావలసిన అన్ని వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమేనని చిరంజీవి తన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిని శాసన నిర్వాహక, విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక, కర్నూల్ను న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలన్నారు చిరంజీవి.
చిరంజీవి ప్రకటనపై రాజధాని రైతులు ఫైర్ .. వైజాగ్ లో ఉన్న స్థలాల కోసమే చిరు వ్యాఖ్యలని మండిపాటు
ఈ మేరకు తన పేరిట ఉన్న లెటర్ హెడ్తో ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సినీ నటుడైన చిరంజీవి సినిమాలను అన్ని ప్రాంతాల వారు చూస్తున్నారని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి వ్యాఖ్యలు చేయాలని వారంటున్నారు. చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ చాలా మంచివాడని, రాజధాని ప్రాంత రైతుల కష్టాన్ని గుర్తించిన నాయకుడని కితాబిస్తున్నారు. చిరంజీవి వైజాగ్ లో ఉన్న తన స్థలాల రేట్లు పెరుగుతాయని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ చేయాలని మాట్లాడుతున్నారని రాజధాని రైతులు అంటున్నారు.
పవన్ కు చిరంజీవికి మధ్య వ్యత్యాసం చెప్తున్న రాజధాని రైతులు
అంతేకాదు చిరంజీవికి పవన్ కళ్యాణ్ కు మధ్య కూడా చెప్తున్నారు రాజధాని రైతులు. పవన్ కళ్యాణ్ ప్రజల కష్టం తెలిసిన నాయకుడు అని, చిరంజీవి లాంటి వ్యక్తి కాదని వారంటున్నారు. పార్టీ పెట్టిన చిరంజీవి ఎవరూ ఊహించని విధంగా పదవుల కోసం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారని ఎద్దేవా చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం గత ఎన్నికల్లో ఓటమి పాలైనా ప్రజల పక్షాన పోరాటం మాత్ర ఆపలేదని కితాబిస్తున్నారు.
చిరంజీవి ప్రకటనతో రాజధాని రైతుల్లో పవన్ పై పెరిగిన క్రేజ్
పవన్ ఔదార్యం ముందు చిరంజీవి వేస్ట్ అని తేల్చి చెబుతున్నారు. చిరంజీవి ఈ తరహా వ్యాఖ్యలు విరమించకుంటే భవిష్యత్తులో చిరంజీవి సినిమాలను ఆడనివ్వం అంటూ రాజధాని ప్రాంత రైతులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొదటి నుంచి చిరంజీవి చాలా స్వార్థపరుడు అని చెప్తున్న రాజధాని ప్రాంత రైతులు పవన్ కళ్యాణ్ చిరంజీవి మధ్య వ్యత్యాసం చాలా ఉందని, పవన్ కళ్యాణ్ మొదటినుంచి కష్టాల్లో ఉన్న వారికి సహాయపడే మనస్తత్వం ఉన్న నాయకుడని చెప్తున్నారు. చిరంజీవి చేసిన ప్రకటనతో తమ్ముడు పవన్ కళ్యాణ్ కు కాసింత ఇబ్బంది కలిగిన, రాజధాని రైతులు మాత్రం పవన్ కళ్యాణ్ ను నెత్తిన పెట్టుకున్నారు. అన్న చిరంజీవిని తిట్టిపోస్తున్నారు.