గోదావరి బోటు ప్రమాదం.. అప్పుడూ , ఇప్పుడూ ఆ జనరల్ మేనేజర్ వల్లే .. జగన్ సర్కార్ పై ప్రజాగ్రహం
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్న చందంగా గోదావరిలో కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదఘటనకు కూడా సవాలక్ష కారణాలున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, అనుమతులు లేకుండా లాంచీలు నిర్వహిస్తున్న నిర్వాహకుల అక్రమార్జన, తగు జాగ్రత్తలు తీసుకోని పర్యాటకులు, ప్రమాద స్థలంలో పొంచి ఉన్న సుడిగుండాలు వెరసి పర్యాటకుల ప్రాణాలు గోదావరిలో కలిసిపోయాయి.
2017 నవంబరు 12న బోటు మునక సమయంలో ఉన్న అధికారే ఇప్పుడు కూడా విధుల్లో
ఇక ఈ ఘటనలో పర్యాటకశాఖ రావాణా జనరల్ మేనేజర్ రామకృష్ణ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే గతంలోనూ జరిగిన బోటు ప్రమాదంలో పర్యాటకశాఖ జనరల్ మేనేజర్ గా నాడు విధులు నిర్వర్తించింది సదరు జనరల్ మేనేజర్ రామకృష్ణనే . రెండేళ్ల క్రితం అంటే 2017 నవంబరు 12న గోదావరిలోని పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 21 మంది చనిపోయారు. ఆ బోటు ప్రమాదం జరిగినప్పుడు జనరల్ మేనేజర్ గా ఉంది రామకృష్ణ నే కావటం , ఇప్పుడు కూడా ఆ అధికారే జనరల మేనేజర్ గా వుండటం ఇప్పుడు పెద్ద చర్చకు కారణం అవుతుంది.
పర్యాటక శాఖ ఉద్యోగులు బీనామీలతో బోట్లు .. నాటి ప్రమాద ఘటనలో రామకృష్ణ సస్పెన్షన్
2017 నవంబరు 12న గోదావరిలో పడవ ప్రమాద ఘటనలో పర్యాటక శాఖ ఉద్యోగులు బీనామీలతో ఆ బోటును నడిపించి ప్రమాదానికి కారణమయ్యారని తేలడంతో అప్పటి ప్రభుత్వం ప్రమాద ఘటన కుబాధ్యులుగా భావించి 8 మందిపై వేటు వేసింది. వీరిలో నాడు పర్యాటక రవాణా విభాగానికి జనరల్ మేనేజర్ గా ఉన్న రామకృష్ణ కూడా ఒకరు. ఇక అప్పటినుండి ఆయనను విధుల్లోకి తీసుకోలేదు. 2017 బోటు ప్రమాద ఘటన సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ విచారణ సైతం పూర్తి కాలేదు.
వైసీపీ సర్కార్ హయాంలో తిరిగి పర్యాటక శాఖ రవాణా జీఎంగా విధులు
కానీ తాజాగా ఏపీ లో వైసీపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజమార్గంలో ఆయన తిరిగి పర్యాటక శాఖ లో రవాణా జీఎంగా బాధ్యతలు చేపట్టారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉంటే చాలు ఎంత పెద్ద తప్పు అయినా కప్పిపుచ్చుకోవచ్చు అన్న దానికి నిదర్శనంగా రామకృష్ణకు పర్యాటక శాఖ లో రవాణా విభాగానికి మరోమారు జనరల్ మేనేజర్ గా విధుల్లోకి తీసుకున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక బస్సులు కూడా ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి.
గతంలోనూ పోస్టింగ్ కోసం ఒత్తిడి .. ఇంకా కొనసాగుతున్న 2017 బోటు ప్రమాద విచారణ
గతంలో ప్రమాదం జరిగిన తర్వాత సస్పెన్షన్ వేటు పడిన రామకృష్ణ తిరిగి ఉద్యోగంలోకి వచ్చేందుకు గతంలో ఉన్న పర్యాటక ఎండిపై ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన తిరిగి రామకృష్ణను ఉద్యోగంలోకి తీసుకోడానికి ససేమిరా అన్నారు. ఇక తాజాగా వైసిపి ప్రభుత్వ హయాంలో ఆయనకు పోస్టింగ్ వచ్చింది. అప్పుడు సస్పెన్షన్ వేటుకు గురైన మిగతా ఏడుగురిని విధుల్లోకి తీసుకోకున్నా ఈయనకు మాత్రం అవకాశం కల్పించింది ఏపీ సర్కార్. ఇప్పుడు కచ్చులూరు ప్రమాద ఘటనలో కూడా రాయల్ పున్నమి బోటు కు అనుమతి లేదని తేలడం, ఇక ఈ విభాగానికి జనరల్ మేనేజర్ గా రామకృష్ణనే ఉండటం జగన్ సర్కార్ పై ప్రజాగ్రహానికి కారణమవుతుంది.