రైతులకు శుభవార్త ... ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ
రైతులకు శుభ వార్త . ఈ ఏడాది వర్షాలకు కొదవ లేదని , కరువు తీరా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్-సెప్టెంబరు మధ్య సగటు వర్షపాతంలో 96 శాతం నమోదవుతుందంటూ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సీజన్లో సాధారణ వర్షపాతమే నమోదవుతుందంటూ ఏప్రిల్ 15న తొలి అంచనా నివేదికను ఇచ్చింది వాతావరణ శాఖ. ఇక తాజాగా మరింత సమాచారం జోడించిన వాతావరణ శాఖ శుక్రవారం రెండో దశ నివేదికను విడుదల చేసింది. చివరి రెండు నెలలకు సంబంధించిన తుది నివేదికను జూలై చివరిలో ఇవ్వనున్నట్టు తెలిపింది.
ఇక ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం రైతులకు మేలు చేస్తుంది. వ్యవసాయం సాఫీగా సాగుతుందని దీర్ఘకాల సగటుతో పోలిస్తే ఈసారి 96 శాతం వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం బలహీనమైన ఎల్నినో పరిస్థితులు నెలకొన్నాయని, నైరుతి ముగిసే వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఖరీఫ్కు ఎంతో కీలకమైన జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా 95 శాతం, 99 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. గత నెల 18న అండమాన్ సముద్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు 25నాటికి మాల్దీవులు, కొమరన్ తీరం వరకు విస్తరించాయని పేర్కొంది . ఆ తరువాత 4 రోజుల వరకు స్థిరంగా ఉన్న రుతుపవనాలు మే 30న అండమాన్లో అన్ని ప్రాంతాలు, ఆగ్నేయ, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించాయని తెలిపింది . ఫలితంగా జూన్ 6 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తానికి ఈసారి రైతన్నలకు సంతోషకరమైన వార్త చెప్పింది వాతావరణ శాఖ.