జగన్ తో భేటీ కానున్న గౌరు చరిత దంపతులు..! పాణ్యం టికెట్ ఎవరికో తేలేది నేడే..!!
హైదరాబాద్ : కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎవరనే విషయంలో నేడు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. లండన్ పర్యటన ముగించుకుని నేడు మంగళవారం హైదరాబాదు చేరుకున్న జగన్మోహనరెడ్డిని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరిత దంపతులు భేటీ కానున్నారు. ఈ భేటీలో పాణ్యం అభ్యర్ధిత్వంపై గౌరు వెంకటరెడ్డి, చరితలు ఒక క్లారిటీ తీసుకోనున్నట్లు చెపుతున్నారు. తమకు టిక్కెట్ ఇస్తేనే పాటీలో ఉండాలని లేని పక్షంలో వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరాలని ఇప్పటికే గౌరు దంపతులు నిర్ణయానికి వచ్చారు.
నేటి భేటీలో ఇదే విషయాన్ని పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికి కూడా స్పష్టం చేయాలని వారు భావిస్తున్నారు. అయితే పాణ్యం టిక్కెట్ తనకే ఖరారైందని కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటికే ఊరూరా ప్రచారం మొదలు పెట్టారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు కాటసాని. ఈ పరిస్ధితుల్లో గౌరు దంపతులు జగన్మోహనరెడ్డితో భేటీ అనంతరం ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారో అని పాణ్యం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.