పడవలకు పసుపు రంగు పడితేనే...ప్రభుత్వ పథకాల వర్తింపట!
ప్రకాశం:ఎపి ప్రభుత్వం బలవంతంగా మత్స్యకారుల పడవలకు పసుపు పచ్చ రంగు వేయిస్తోందా?...ఆ రంగు వేస్తేనే మీకు ప్రభుత్వ పధకాలు వర్తిస్తాయని బెదిరిస్తోందా?...అంటే తాజాగా విడుదల చేసిన సర్క్యులర్ అలాగే ఉందంటున్నారు కొందరు మత్స్యకారులు.
ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో ఎపిలోని టిడిపి ప్రభుత్వం వీలైనంతమంది ప్రజలను పసుపు పచ్చరంగు ప్రభావంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోందని, ఆ దిశలో మత్స్యకారులకు కొన్ని ప్రత్యేక నిబంధనలను సైతం విధించిందని వైసిపి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. చేపల వేటపై నిషేధం నేపథ్యంలో మత్స్యకారులు తమ పడవలు, వలలు మరమ్మత్తులకు ఉపక్రమించగా తమ కలర్ ఎక్స్ పెరిమెంట్ కు ఇదే సరైన సమయమని టిడిపి నేతలు రంగంలోకి దిగారంటున్నారు.
వేటపై నిషేధం...రంగంలోకి రంగు నేతలు
సముద్రంలో 61 రోజుల పాటు చేపల వేట నిషేధించడంతో మత్స్యకారులు తమ పడవలు, వలలు మరమ్మతులు చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో ప్రత్యేక హోదా కోసం పడవలతో నిరసన ఎఫెక్టో ఏమో కాని టిడిపి నేతలు దృష్టి మత్స్యకారులు వేటకు వినియోగించే పడవలపై పడిందట. దీంతో మత్స్యకారులుఅందరూ తప్పనిసరిగా తమ పడవలకు పసుపు పచ్చరంగు వేయించుకోవాలని, అలా వేయించుకోని వారికి ప్రభుత్వ పథకాలు వర్తించవని తేల్చిచెబుతున్నారట.
టిడిపి నేతల...నిబంధన ఇదేనట
సముద్రంలో నీటిపై తేలియాడే పై భాగం మేరా పడవకు పసుపు పచ్చరంగు వేయాలని, ఒడ్డు నుంచి చూస్తే సముద్రంలో ఉన్న పడవ పసుపుగా కనిపించాలని నిబంధన పెట్టారని, అలాగే సముద్రం నీటిలో మునిగే అడుగుభాగం నీలం రంగుతో ఉండాలని ఉత్తర్వులు జారీచేసింది. పైగా అలా పడవలకు పసుపు పచ్చరంగు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారంటూ స్పష్టం చేశారట. దీంతో కొంతమంది మత్స్యకారులు విధిలేని పరిస్థితుల్లో తమ పడవలకు ఇలా ఎల్లో రంగు వేయించుకునే పనిలో పడ్డారనేది వైసిపి నేతల ఆరోపణ. అయితే కొందరు మత్స్యకారులు మాత్రం ఇదేం నిబంధన, ఇలా బలవంతంగా పసుపు రంగు వేయాలని నిబంధన పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారట.
మాకు ఇష్టమైన...వేరే రంగు వేసుకోవద్దా?...
సాధారణంగా సముద్రంలో వేట సాగించే మత్స్యకారులు తమ తమ పడవలకు వారికి ఇష్టమైన రంగులు వేసుకుంటారు. అంతేకాదు ఈ ఆ రంగులకు వారి దృష్టిలో ఎంతో ప్రాధాన్యం కూడా ఉంది. కేవలం రంగులే కాదు డిజైన్లు కూడా రకరకాలుగా వేసుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది వారి మనోభావాలకి సంబంధించిన విషయంగా చెప్పుకోవచ్చు. అయితే అన్నిపడవలు ఏకరూపంగా ఉండాలన్నసాకుతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా పడవలన్నింటికీ పసుపు పచ్చరంగును తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లాలో...సర్క్యులర్ జారీ
ప్రకాశం జిల్లాలోని 11 మండలాల్లో సుమారు 102 కిలోమీటర్ల మేర సముద్రతీరం విస్తరించి ఉంది. ఈ తీరం వెంబడి కనీసం 12వేల మంది మత్స్యకారులు మూడురకాల పడవలను ఉపయోగించుకొని సముద్రంలో వేట కొనసాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లో 42 మెకనైజ్డ్ బోట్లు, 2505 మోటరైజ్డ్ బోట్లు, 1649 సంప్రదాయ పడవలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా ఈ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి చేపలను వేటాడుకొని కుటుంబ పోషణ జరుపుతుంటారు.
చేపల వేట నిషేధంతో...రంగు పడింది
అయితే మత్స్యసంపద వృద్ది కోసం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి ఈనెల 15వ తేదీ జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటను నిషేధించారు. ఈ నిషేధ కాలంలోనే మత్స్యకారులు తమ పడవలు, వలలు మరమ్మతులు చేసుకుంటుంటారు. ఈ విషయం గమనించిన ఎపి ప్రభుత్వం వారిచేతే పడవలకు పసుపు పచ్చరంగు వేయించాలని భావించిందట. ఆ మేరకు మత్స్యకారులంతా తమ పడవలకు పసుపు పచ్చ రంగు వేయాలంటూ తీర ప్రాంత జిల్లాలకు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది.