గవర్నర్ భాష రాక బుక్కయిపోయారా?...లేక ఆంధ్రా పరిస్థితి కదిలించిందా?
అమరావతి: సోమవారం ప్రారంభమైన ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై టిడిపి వర్గాలు హర్షం వ్యక్తం చెయ్యగా, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల గవర్నర్ వ్యవహరించిన తీరు గమనించిన వారికి మాత్రం ఆశ్చర్యం కలిగించింది. మరోవైపు నెటిజన్లు కూడా భాష రాని గవర్నర్ ను టిడిపి భలే బుక్ చేసిందని సెటైర్లు విసురుతున్నారు.
గవర్నర్ నరసింహన్ కు ప్రసంగ ప్రతిని చదివి అర్థం తెలుసుకునేంత సమయం ఉండి ఉండదని, తానేం చదివాడో ముందే భావం తెలిసుంటే ఆయన ఖచ్చితంగా ఆ ప్రసంగ ప్రతిని యథాతథంగా చదివి వుండేవారు కాదని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. కారణం ఆ ప్రసంగం తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా, కేంద్రాన్ని నిలదీసే విధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ ఆ పని చేయడం కరెక్ట్ కాదనేది కొందరి వాదన...
గవర్నర్ ప్రసంగం...సారాంశం ఏమిటంటే...
ఎపి బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎపి విభజన చట్టంలోని అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. విభజన హామీలన్నీ నెరవేర్చాలని, రెవిన్యూ లోటును భర్తీ చేయాలని కోరారు. హామీల అమలు కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్న గవర్నర్...ఎపిని విభజన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని చెప్పారు...ఈ ప్రసంగం విన్నవారికి గవర్నర్ ఎపి తరుపున వకాల్తా పుచ్చుకున్నట్లు అర్ధం అవుతుంది.
ఇంతకాలం ఎపికి, టిడిపికి వ్యతిరేకంగా...హఠాత్తుగా ఎందుకిలా?...
గవర్నర్ నరసింహన్ నరసింహన్ ఎపి పట్ల వివక్ష చూపుతున్నారని టిడిపి నేతలతో పాటు బిజెపి నాయకులు కూడా విమర్శలతో దండెత్తిన పరిస్థితి నరసింహన్ ది...మరి అలాంటి నరసింహన్ ఇంత కీలక సమయంలో ఎపి తరుపున అంత ఏకపక్షంగా ప్రసంగించడానికి కారణం ఏమిటి?...ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నట్లు నిజంగానే ఎపికి జరిగిన అన్యాయం ఆయనను కదిలించిందా?...అందుకే ఆత్మ ప్రబోధానుసారం అలా ప్రసంగించారా?...మరి అంత అన్యాయం జరుగుతుంటే ముందే ఎందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యలేదు...లేక కెసిఆర్ , చంద్రబాబు మిత్ర పక్షాలుగా మారిన నేపధ్యంలో కెసిఆర్ కూడా ఆంధ్రా ప్రత్యేక హోదాకు మద్దతు పలికిన తరుణంలో గవర్నర్ కూడా తన అభిప్రాయం మార్చుకున్నారా? లేక...తెలుగు భాష రాక...ప్రసంగ ప్రతిని ముందు చదివించుకొని అర్ధం తెలుసుకునే సమయం లేక అలా బుక్కయ్యారా?...లేక టిడిపినే నయానో భయానో ఆ ప్రసంగ ప్రతి చదివేలా చేసిందా?...ఈ ప్రశ్నలకు గవర్నర్ నరసింహన్ స్వయంగా సమాధానం చెబితేనే తెలుస్తుంది.
కేంద్రం ప్రతినిధిగా ఉండి...కరెక్టేనా?
సాధారణంగా బడ్జెట్ ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వం సిద్దం చేస్తే, గవర్నర్ చదవడం సాధారణంగా జరిగేదే...అయితే ఈసారి ఎపిలో నెలకొన్న లాంటి అసాధారణ పరిస్థితులు సాధారణంగా ఏ రాష్టంలో ఈ విధంగా వచ్చి ఉండే అవకాశం లేదు. అందుకే స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తే గవర్నర్ చదివేస్తాడు...కానీ తాజా ప్రసంగానికి సంబంధించి గవర్నర్ ప్రసంగంలో ప్రధానంగా కేంద్రాన్ని తప్పు పడుతున్నట్లుగానే ఉంది...ఒక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తూ వారి పట్లే అవిశ్వాసం చూపడం నైతికంగా సహేతుకం కాదు.
ఒకవేళ...తెలిసి గత్యంతరం లేక చదివారా?...
ఒకవేళ ఆ ప్రసంగ ప్రతిలో భావం తెలిసి కూడా గత్యంతరం లేకో...లేక...సభా మర్యాదను కాపాడేందుకు చదివాననో అనేందుకు ఆస్కారం లేదు...కారణం...రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ అలా యథాతధంగా చదవాల్సిన అవసరం లేదు...తనకు నచ్చని చోట్ల మార్పులు చేర్పులు కోరే సూచించే వెసులుబాటు గవర్నర్ కు ఉంది. అందుకు ఉదాహరణ కేరళ లో ఆమధ్య కాలంలో కేరళలో ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగాన్ని గవర్నర్ యథాతథంగా చదివేందుకు నిరాకరించారు.
టిడిపి...టిట్ ఫర్ టాటా?...
ఇటీవలి వరకు అనేక విషయాల్లో ఎపి ప్రభుత్వాన్ని, టిడిపిని ఇబ్బంది పెట్టిన గవర్నర్ నరసింహన్ ను టిడిపి కావాలనే ఇలా ఇరికించిందా?...కారణాలేమైనా ఎపి ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ ప్రతిని గవర్నర్ యథాతథంగా చదివేలా చేయడం ఎపి ప్రభుత్వం విజయంగానే భావించవచ్చు. అలాగే కేంద్రం అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రం కోరుతున్న ప్రత్యేక హోదాకు మద్దతుగా కేంద్రాన్నే నిలదీసేలా గవర్నర్ తన ప్రసంగాన్ని చెయ్యడమంటే...అందుకు ఆయనను ఒప్పించిన క్రెడిట్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది...మరయితే ఈ ప్రసంగంపై కేంద్రం ఏవిధంగా స్పందిస్తుంది. గవర్నర్ కూడా కోరుతున్నారు కాబట్టి విభజన హామీల నెరవేర్పు, ప్రత్యేక హోదా కేటాయింపు పై సానుకూలంగా స్పందిస్తుందా?...లేక తమ ప్రతినిథి అయివుండి తమని నిలదీసినందుకు ఆగ్రహిస్తుందా?...సమాధానం అతి త్వరలోనే తెలిసిపోతుంది...