విచిత్రం:శివాలయంలో హుండీ దోపిడి...విగ్రహాలు చోరీ కాకుండా నాగుపాము కాపలా!
చిత్తూరు:దైవ విశ్వాసాలకు సంబంధించి చోటుచేసుకునే కొన్ని సంఘటనల నిర్వచించలేము...అలాంటి ఘటనలకు హేతువాదులు ఇచ్చే వివరణ ఏమాత్రం నమ్మశక్యంగా ఉండదు.
అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా వాల్మీకిపురం శివాలయంలో చోటుచేసుకుంది. దేవాలయాన్ని కొల్లగొట్టేందుకు వచ్చిన దొంగలు బయట ఉన్న హుండీనైతే దోచుకోగలిగారు గాని...గుడిలోని విగ్రహాలు, నగల జోలికి వెల్లేకపోయారు. అందుకు కారణం ఒక నాగు పాము వాటికి కాపలా కాయడమే...ఉదయం పూజారి వచ్చేంత వరకు గుడి ద్వారం వద్ద కాపలా కాసిన నాగుపాము అర్చకుడు రాగానే గర్భ గుడిలోకి వెళ్లి అక్కడే ఉంటోంది. వివరాల్లోకి వెళితే...
వాల్మీకిపురం బాహుదా నది సమీపంలోని పురాతన ఉమా
మహేశ్వరస్వామి ఆలయంలో బుధవారం దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలను ధ్వంసం చేసి హుండీని అపహరించుకు పోయారు. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకుడు మధుస్వామి చోరీ విషయాన్ని గ్రహించి నివ్వెరపోయారు. లోనికి వెళ్లి చూద్దామనుకునే సమయానికి గర్భగుడి ద్వారం వద్ద పెద్ద నాగుపాము పడుకుని ఉండడం గమనించి ఆలయం వెలుపలకు వచ్చాడు. ఈలోపే ఆలయ కమిటీ సభ్యులు అక్కడికి చేరుకుని విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
నాగుపాము కాపలా...విగ్రహాలు,నగలు భధ్రం
ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఆలయ పరిసరాలను పరిశీలించారు. చోరీ అనంతరం గర్భగుడి ముఖద్వారం చెంత నాగుపాము కనిపించడంతో దుండగులు పరారయ్యారని భక్తులు విశ్వసిస్తున్నారు. హుండీకి సమీపంలోనే ఉన్న ఇనప్పెట్టెలో ఉత్సవ విగ్రహాలు, స్వామివారి నగలు, విలువైన వస్తువులు ఉన్నా దొంగలు వాటి జోలికి వెళ్లక పోవడానికి కారణం నాగపాము కాపలా వలనేనని వారు భావిస్తున్నారు.
భక్తుల పూజలు...కొనసాగుతున్నాయి
పూజారి రాకతో ఉదయం 6 గంటలకు గర్భ గుడిలోకి వెళ్లిన నాగుపాము అక్కడే ఉంటోంది. భక్తుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఆ నాగుపాముకు పూజలు చేస్తున్నారు. ఇదిలా వుంటే శివాలయం హుండీ చోరీ తరువాత ఆ దొంగలు శివపురం చౌడేశ్వరిదేవి ఆలయంలో కూడా చోరీకి యత్నించినట్లు ఆనవాళ్లు తెలుస్తున్నాయి. ముఖద్వారం తాళం రాకపోవడంతో వారు వెళ్లిపోయినట్లు అర్థమవుతోంది. ఈ చోరీపై ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా నేత ఇంట్లో...విగ్రహాల చోరీ
మరోవైపు విజయవాడలోని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ ఇంట్లో చోరీ జరిగింది. బుధవారం రాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు రెండు కేజీల వెండి దేవతా విగ్రహాలు చోరీ చేశారు. ఉదయాన్నే చోరీ జరిగిన విషయాన్ని గమనించిన టిడిపి మహిళా నేత పంచుమర్తి అనురాధ అనంతరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.