ప్రధాని, హోంమంత్రి దృష్టిసారించాలి: నాడు ఆ ‘తెలంగాణ ఎంపీ’ అంటూ పవన్ కళ్యాణ్
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతృ భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరోసారి స్పష్టం చేశారు. 'తెలుగు వర్ధిల్లితేనే వెలుగు' అన్న పేరుతో ఏపీ మాజీ డీజీపీ అరవిందరావు రాసిన వ్యాసాన్ని ఊటంకిస్తూ పలు కీలక అంశాలపై స్పందించారు.
తెలుగు వర్ధిల్లితేనే వెలుగు
‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిజిపి శ్రీ అరవిందరావు గారు ‘తెలుగు వర్దిల్లతేనే వెలుగు' అన్న పేరు తో తెలుగు భాషా పరిరక్షణ', గురించి రాసిన వ్యాసం,అన్ని కోణాలలో చాల విశ్లేషణాత్మకంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని లోని అంశాలని పరిశీలించాలి' అని పవన్ కళ్యాన్ సూచించారు.
దేశ సమగ్రతను ప్రేమించే వ్యక్తిగా..
‘ఈ మాటలు ఈ రోజున ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికలో 'తెలుగు వర్థిల్లితేనే వెలుగు' అనే వ్యాసంలో వ్యాసకర్త ఉటంకించారు. ఆ వ్యాసకర్త ఒక సామాజిక శాస్త్రవేత్త అయితే చూడాల్సిన విధానం వేరేలా ఉంటుంది. ఈయన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్ గా, ఆ తరవాత డి.జి.పి.గా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించిన శ్రీ కె.అరవిందరావు గారు. దక్షిణ భారతదేశాన్ని సంస్కృతిపరంగా విడదీయడానికి ఒక తాత్త్విక భూమికను తయారు చేస్తున్నారు అని లేవనెత్తిన అంశాల్ని చాలా నిశితంగా పరిశీలించి క్షుణ్ణంగా చూడాలి. ఎందుకంటే అందులో సత్యం ఉంది. జనసేన మూల సిద్దాంతాల్లో 'ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం' అని నేను పెట్టడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో నేను రెండుమూడు సందర్భాల్లో దక్షిణాది, ఉత్తరాది వ్యత్యాసాన్ని ప్రస్తావించాను. దక్షిణ భారత ప్రజల ఆకాంక్షలను జాతీయ స్థాయి నాయకత్వం అర్థం చేసుకోవాలన్నాను. దాన్ని అర్థం చేసుకున్నవాళ్ళు ఉన్నారు. నేను ఏ స్పూర్తితో చెప్పానో అర్థం చేసుకోనివాళ్ళూ ఉన్నారు. దేశ సమగ్రతను ప్రేమించే వ్యక్తిగా చెప్పానే తప్ప మరో ఆలోచన లేదు' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఎంపీ వ్యాఖ్యలంటూ..
‘2014 లో తెలంగాణ ఏర్పడ్డాక- ఒక తెలంగాణ మహిళా ఎంపీ కశ్మీర్ తోపాటు తెలంగాణ కూడా భారత యూనియన్ లో బలవంతంగా కలుపబడ్డాయి అన్నారు. ఎంత గగ్గోలు అయిందో మనందరికీ తెలుసు. రాష్ట్ర విభజనకు ముందు ఉద్యమ సమయంలో కొందరు పెద్ద స్థాయి వ్యక్తులు మాకూ ఈ దేశానికీ సంబంధం లేదు అనడం లాంటి మాటలు మీడియాలో చూశాం. నేనూ విన్నాను. అలాగే రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నత స్థాయి, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు, అనేకమంది మేధావులు, చాలామంది యువతీ యువకులు కూడా మేము ఈ దేశంలో అంతర్భాగం కాదా అని నాతో ప్రస్తావించినప్పుడు నాకు చాలా భయం కలిగింది. నాలుగు గోడల మధ్య మాట్లాడే ఇటువంటి మాటలు రెండుమూడు దశాబ్దాల తరవాత ఉద్యమాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. దానికి ఉదాహరణే తెలంగాణ ఉద్యమం. ప్రత్యేక రాష్ట్రమైంది. 1969 , 70 ల్లోనే మేము కలసి ఉండలేం అన్నప్పుడు ఆ అంతరాలను సరి చేయలేదు. నాలుగు గోడల మధ్య మాటలుగా వదిలేశారు. మూడు దశాబ్దాల తరవాత ఉద్యమం అయింది. ఇలాంటి అభిప్రాయాలను నేను తేలిగ్గా తీసుకోను. సున్నితంగా సునిశితంగా పరిశీలిస్తాను' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
దేశ సమగ్రతకే ముప్పు..
‘ఇవి రావడానికి మూలాలు ఎక్కడ ఉన్నాయో శోధించాల్సి ఉంది. మన భారత దేశం విభిన్న సంస్కృతులు, భిన్నమైన ప్రాంతాలు, భాషలు, ఆచార వ్యవహారాల సమాహారం. వీటిని ఏకత్వంలోకి తీసుకురావాల్సి ఉంది. భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి నాయకత్వం కృషి చేయలేకపోవడం వల్ల అంతరాలు అలాగే ఉన్నాయి. కొంతమంది రాజకీయ లబ్ది కోసం ఈ అంతరాలను పెంచేశారు. పెంచేస్తూ ఉంటారు కూడా. నేను ఈ అభిప్రాయాలనే 2014 లో అప్పుడు ప్రధాన మంత్రి అభ్యర్థి, ప్రస్తుత ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోడీ గారికి తెలియచేశాను. మీలాంటి బలమైన వ్యక్తులు ఉన్నంతకాలం ఫర్వాలేదు గానీ బలహీనమైన వ్యక్తులు పాలనలోకి వచ్చినప్పుడు ఉత్తర, దక్షిణ అనే వేర్పాటువాదాలు వస్తాయి... వీటిపై దృష్టి సారించాలని చెప్పాను. ప్రాంతీయంగా సంస్కృతి, భాషల ప్రాముఖ్యతను, విశిష్టతనీ అర్థం చేసుకొనే నాయకత్వాలు... ప్రజల్లో అంతరాలను తగ్గించే నాయకత్వాలు లేనప్పుడూ, కేవలం తమ రాజకీయ ఉనికి కోసం పని చేసే నాయకులూ ఉంటే చాలా వేర్పాటువాదాలకు బలమైన బీజాలు ఏర్పడతాయి. ఇవి తెలిసి చేసినా, తెలియక చేసినప్పటికీ అవి దేశ సమగ్రతకు ముప్పుగా మారతాయి. అందువల్ల ప్రాంతీయతను విస్మరించని జాతీయ నాయకులూ ఎక్కువ మంది కావాలి. అలాగే ప్రాంతీయ స్థాయి నాయకులూ జాతీయ భావాలను, జాతీయ సమగ్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశపు మూలాలైన మన భాష, సంస్కృతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతీయ నాయకులకు మన సంస్కృతి, భాషలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. తెలిసీ తెలియకుండా మన భాషకు, సంస్కృతికీ నష్టం కలిగిస్తే దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంది ' అని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని, కేంద్ర హోంమంత్రి ప్రత్యేక దృష్టి సారిచాలి..
‘మాతృ భాష మూలాలను రేపటి తరానికి తెలీకుండా చేయడం ద్వారా దేశంలో భాష, సంస్కృతుల విశిష్టతకీ, సనాతన ధర్మ పవిత్రతకీ నష్టం కలిగిస్తున్నారు. ఏ సంస్కృతి ఏ సంప్రదాయాలు, ఏ భాష పునాదులపై దేశం నిలబడిందో ఆ సమగ్రతను ఉత్తర, దక్షిణ వైరుధ్యాలతో విచ్చిన్నం చేస్తారు. కశ్మీర్ ను దేశంలో అంతర్భాగం చేసిన తరుణంలో దేశ భాష సంస్కృతులను దెబ్బ తీసి, సమగ్రతకు భంగం కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశాన్ని సంస్కృతిపరంగా విడదీయడానికి ఒక తాత్త్విక భూమికను తయారు చేస్తున్నారని విశ్రాంత డీజీపీ శ్రీ అరవింద రావు గారు చెప్పిన విషయంపై ప్రధానమంత్రి గారు, కేంద్ర హోమ్ మంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తగిన విధంగా స్పందించాల్సి ఉంది' అని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు.