జయలలిత ఆప్తుడి మెడకు ఉచ్చు: శేఖర్ రెడ్డి పుణ్యమే !
ఇసుక క్వారీల వ్యాపారం చేసే ప్రముఖ కాంట్రాక్టర్ బాబు శేఖర్ రెడ్డి అలియాస్ శేఖర్ రెడ్డి కారణంగా ఇప్పుడు తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు పీకలలోతు కష్టాల్లో పడ్డారు.
తిరుపతి/చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామ్మోహన్ రావు మెడకు ఉచ్చు బిగుసుకుంటున్నది. ఇసుక క్వారీల వ్యాపారం చేసే ప్రముఖ కాంట్రాక్టర్ బాబు శేఖర్ రెడ్డి అలియాస్ శేఖర్ రెడ్డి కారణంగా ఇప్పుడు రామ్మోహన్ రావు పీకలలోతు కష్టాల్లో పడ్డారు.
రామ్మోహన్ రావుకు సంబంధించిన ఆస్తులు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. బుధవారం చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు.
శేఖర్ రెడ్డి అక్రమ ఆస్తులు సంపాదించడానికి రామ్మోహన్ రావు పూర్తిగా సహకరించారని, అందుకు ప్రతిఫలంగా తిరుపతి, చిత్తూరు తదితర ప్రాంతాల్లో రామ్మోహన్ రావు కుటుంబ సభ్యుల పేర్ల మీద అక్రమ ఆస్తులు రిజిస్టర్ చేయించారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శేఖర్ రెడ్డి అక్రమ వ్యాపారాల విషయాలు తెలిసినా రామ్మోహన్ రావు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. శేఖర్ రెడ్డితో పాటు ఆయన వ్యాపారాలతో రామ్మోహన్ రావుకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? రామ్మోహన్ రావు అక్రమ ఆస్తులు సంపాదించారా ? అని ఆరా తీస్తున్నారు.
అయితే సోదాలు పూర్తి అయిన తరువాతే అన్ని విషయాలు వెల్లడిస్తామని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు. మొత్తం మీద తమిళనాడు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇప్పుడు శేఖర్ రెడ్డి అక్రమ ఆస్తుల పుణ్యమా అంటూ పీకలలోతు కష్టాల్లో పడిపోయారు.