పల్నాడు హత్యలపై ఏడీజీ వివరణ... రౌడీల మధ్య జరిగిన ఘర్షణలే కారణం
ఏపీలో జరుగుతున్న హత్యలు రాజకీయాపరమైనవి కాదని అడిషనల్ డైరక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్ స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో పరిస్థితి అందోళనకరంగా ఉందంటూ కొన్ని పార్టీలు చేస్తున్నా ఆరోపణల్లో వాస్తవాలు లేవని చెప్పారు. పల్నాడులో జరిగే ఘర్షణలు రాజకీయా ప్రేరేపితమైనవి కావని ఆయన చెప్పారు. మరోవైపు ఒకేపార్టీపై కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణల్లో కూడ నిజం కాదని అన్నారు. ఇక ఆత్మకూరులో సైతం కూలిపనుల కోసం వెళ్లారు తప్ప, ఎవరు భయంతో ఊరు విడిచి వెళ్లలేదని వివరించారు.
పల్నాడు పరిస్థితులపై నివేదిక
ఇక పల్నాడులో జరిగిన ఉద్రిక్తతలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశాలతో ఇచ్చారని తెలిపారు. ఈనేపథ్యంలోనే రాజకీయ ఘర్షణల్లో ఎనిమిది మంది చనిపోయారంటూ ఆరోపణలు రావడంతో, అవి రౌడీల మధ్య జరిగిన హత్యలని పేర్కోన్నారు.ఇక 110 కేసులు టీడీపీ నేతలపై నమోదు అయ్యాయని వచ్చిన ఆరోపణల్లో కూడ నిజం లేదని వివరించారు. మొత్తం కేసుల్లో టీడీపీ వర్గీయులపై 41 మరో 70 కేసులు వైసీపీ వర్గీయులపై నమోదు అయ్యాయని చెప్పారు.
పల్నాడులో రాజకీయ హత్యలు కాదు
మరోవైపు పల్నాడు ప్రాంతం విడిచి మొత్తం 545 మంది గ్రామం విడిచి వెళ్లిపోయారని అందులో 345 మంది కేవలం కూలీ పనుల కోసమే వెళ్లారని, వారిలో 312 మంది తిరిగి గ్రామానికి చేరుకున్నారని చెప్పారు. కాగా పల్నాడు ప్రాంతంలో సాధారణంగా ఘర్షణలు జరుగుతాయని వాటిని రాజకీయ ఘర్షణలుగా చిత్రీకరిస్తున్నారని ఆయన వివరించారు.దీంతో భవిష్యత్లో ఎలాంటీ గొడవలు జరగకుండా ప్రజలకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏపీ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని అన్నారు.
కొద్ది రోజుల క్రితం పల్నాడులో ఉద్రిక్తతలు
గత నెల రోజుల క్రితం పల్నాడులో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే, ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక, టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆ పార్టీ ఆరోపణలు చేసింది. మరోవైపు వైసీపీ వర్గీయులు సైతం టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఇరువురు నాయకులు ఆందోళనలకు పిలుపునివ్వడం, పోలీసుల మోహరింపులతో, మొత్తం పల్నాడు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే...
ఈ సంధర్భంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇళ్లపై దాడులు చేసి, ఊళ్ల నుంచి తరిమేశారని అంటున్నారు. దాదాపు 500 కుటుంబాలు వేరే ఊళ్లల్లో దాచుకోవాలా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు . పల్నాడులో హక్కుల ఉల్లంఘన సాగుతోందని ఆయన ఆరోపణలు చేశారు.