వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యబాబోయ్ అయ్యన్న ఏంటి ఇలా?..మంత్రి చెప్పిన లంగా-జిఎస్టీ కథ

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవలికాలంలో తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఒకవైపు ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు ముమ్మరంగా ఉద్యమాలు చేస్తుంటే ఆయన అశ్లీల నృత్యాలు చేసి తాను అప్రతిష్ట పాలవడమే కాకుండా టిడిపి ప్రభుత్వాన్ని కూడా వేలెత్తి చూపేలా చేశారు.

తాజాగా మోడీ జిఎస్టీ మహిళల్ని ఇబ్బంది పెడుతోందంటూ అయ్యన్న చెప్పిన లంగా-జిఎస్టీ కథ, అలాగే అగ్రి గోల్డ్ డిపాజిట్లపై వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. అగ్రి గోల్డ్ డిపాజిట్లపై మంత్రి వ్యాఖ్యలకు మహిళలు అక్కడికక్కడే నిరసన తెలపగా, మంత్రి చెప్పిన లంగా-జిఎస్టీ కథపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. మంత్రి అయ్యన్న ఇటీవలి వరుస వివాదాలు చూస్తుంటే ఆయన తన వ్యాఖ్యలపై నియంత్రణ కోల్పోయినట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మంత్రి అయ్యన్న...వరుస వివాదాలు

మంత్రి అయ్యన్న...వరుస వివాదాలు

ప్రత్యేక హోదా ఉద్యమాల నేపథ్యంలో అశ్లీల నృత్యాలు...మేకప్ వేస్తే మహిళల కంటే హిజ్రాలు బాగుంటారు అనే వ్యాఖ్యలపై రేగిన దుమారం...మరో మంత్రి గంటాతో విభేదాల నేపథ్యంలో మంత్రి అయ్యన్నపాత్రుడు వివిధ ఘటనల విషయమై స్పందించిన తీరు పలు సార్లు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఒకవేళ అయ్యన్న వర్గానికి అన్యాయం జరుగుతున్నా సరే...ఆ విషయమై ఆయన ప్రతిస్పందిస్తున్న తీరు చివరకు ఆయన్నే తప్పు పట్టేలా చేయడమే కాదు ప్రభుత్వాన్ని ఇబ్బందిపాల్జేస్తోంది. అలాగే గుంటూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా కూడా పార్టీ అంతర్గత కలహాల విషయమై ఆయన మీడియాకు ఎక్కిన తీరు చంద్రబాబుకు ఆగ్రహం రప్పించింది. అయితే ఇంత జరిగినా కారణాలేమైనా మంత్రి అయ్యన్నపాత్రుడిని ఎవరూ హెచ్చరించలేదనే అర్థం అవుతోంది. కారణం మంత్రి తాజాగా రాజమండ్రి ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ సభలో ప్రసంగమే ఇందుకు నిదర్శనం.

అయ్యన్న చెప్పిన...లంగా-జిఎస్టీ కథ

అయ్యన్న చెప్పిన...లంగా-జిఎస్టీ కథ

మోడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టీ వల్ల మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారంటూ అయ్యన్న చెప్పిన రియల్ స్టోరీ ఇది...ఆయన మాటల్లోనే..."ఓ రోజు నేను రైలులో వెళుతుంటే పక్కసీట్లో మహిళ కూర్చుంది. ఆమె చీర చాలా బాగుంది. నేను కూడా అటువంటి చీర మా ఆవిడకు కొందామని...ఎక్కడ కొన్నారని ఆమెను అడిగాను. దానికి ఆమె సమాధానమిస్తూ...ఇది మూడేళ్లనాటి పాత చీర, దిక్కుమాలిన మోదీ...చీరల మీద, జాక్కెట్‌ మీద, చివరకు లంగా మీద కూడా జీఎస్టీ వేశారు. ఇంకెక్కడ కొంటామని ఆమె వాపోయింది"...అని చెప్పారు. జీఎస్టీ వల్ల మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారంటూ తనకు ఎదురైన ఈ ఘటన గురించి ఆయన వివరించారు. ప్రధాని మోదీ ప్రజలకు ఎంత నష్టం చేస్తున్నారో తెలిపారు.

మంత్రి స్టోరీపై...నెటిజన్ల సెటైర్లు

మంత్రి స్టోరీపై...నెటిజన్ల సెటైర్లు

అయితే మంత్రి అయ్యన్న చెప్పిన ఈ స్టోరీపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. మంత్రి రైల్లో ప్రయాణం చేస్తే మహిళ పక్కన కూర్చోవడం ఏంటి?...అంటే ఆయన సాధారణ తరగతిలో కూర్చునే అవకాశం లేదు. మంత్రులు ఎవరైనా ఫస్ట్ క్లాస్ ఎసి తరగతుల్లోనే ప్రయాణం చేస్తారు. సాధారణ తరగతుల్లో ప్రయాణం చేయడం తటస్థించదు...అక్కడ గుర్తు తెలియని మహిళలు పక్కన కూర్చునే అవకాశం ఉండదు...ఒకవేళ అనుకోకుండా అలా జరిగినా ఆవిడని మంత్రి చీర గురించి అడుగుతూ మాటలు కలపడం ఏంటో...ఎసి తరగతుల్లో ప్రయాణించేవారు మూడేళ్లుగా చీర కొనే పరిస్థితి ఉండకపోవడం ఏంటో...ఆమె మంత్రి అడిగిందే తడవుగా లంగా గురించి చెప్పడం ఏంటో...దాన్ని మంత్రి గారు బహిరంగ సభలో పూర్వపరాలు ఆలోచించకుండా చెప్పేయడం ఏంటో...ఏదేమైనా మంత్రి అయ్యన్నల్లో ఇటీవల ఏదో మార్పు కనిపిస్తోందని...అందుకే కూడా బాగా చేస్తున్నారని, చీరలు, లంగాల గురించి పట్టించుకుంటున్నారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

అదే సభలో...అగ్రి గోల్డ్ వివాదం

అదే సభలో...అగ్రి గోల్డ్ వివాదం

ఇదే సభలో మంత్రి అయ్యన్న పాత్రుడు అగ్రిగోల్డ్‌ బాధితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మంత్రి ఏమన్నారంటే..."రూ.వెయ్యికి రూ.40 వేలు ఇస్తామంటే ఆశపడి అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేశారు. తీరా వాళ్లు బిషాణా ఎత్తివేయడంతో లబోదిబోమంటున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యులా? మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యులా?" అని మండిపడ్డారు. దీంతో మంత్రి అయ్యన్న వ్యాఖ్యలపై సభలోనే ఉన్న ఒక మహిళ నిరసన వ్యక్తం చేశారు. మిగిలిన మహిళలు ఆమెకి మద్దతు పలికారు. దీంతో సభలో అలజడి లేవడంతో పక్కనే ఉన్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జోక్యం చేసుకుని...ఇప్పటికే సీఎం చంద్రబాబు అగ్రి గోల్డ్ బాధితులందరికీ న్యాయం చేయడానికి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలోనూ దీనిపై చర్చించినట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రూ.20 వేలు చెల్లించిన వారికి ముందుగా డబ్బు ఇవ్వాలని అనుకున్నామని, త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. దీంతో మంత్రి అయ్యన్న బైటకు వెళుతున్నారంటే ఎప్పుడు ఏ వివాదం ముంచుకొస్తుందోనని పార్టీ ముఖ్యులు ఆందోళన చెందుతున్నారట. మంత్రి అయ్యన్న వ్యవహారశైలిలో ఏదో మార్పు ఇటీవలికాలంలో కొట్టచ్చినట్లు కనిపిస్తోందని చర్చించుకుంటున్నారు.

English summary
East Godavari: TDP government is worried about the recent controversies of the Andhra Pradesh Roads and Buildings Minister Ch.Ayyannapathrudu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X