ఆర్కే ఈ నెల 14న మరణించారు - కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి : అంత్యక్రియలు పూర్తి -మావోయిస్టుల ప్రకటన..!!
మావోయిస్టు కీలక నేత అక్కిరాజ్ హరగోపాల్ (ఆర్కే) మృతిపై మావోయిస్టు పార్టీ అధికారికంగా స్పందించింది. ఆర్కే మరణాన్ని పార్టీ ధ్రువీకరించింది. ఈ నెల14వ తేదీ ఉదయం 6 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారని పార్టీ ప్రకటనలో పేర్కొంది. ఆయనకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలైందని.. వెంటనే డయాలసిస్ ట్రీట్ మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయి ఇతర అనారోగ్య సమస్యలు మైదలు అమరుడయ్యాడని పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆ ప్రకటనలో వివరించారు.
మరణించారు..అంత్యక్రియలు పూర్తి చేసాం
ఆయనకు పార్టీ మంచి వైద్యం అందించినా..దక్కించుకోలేకపోయిందని పేర్కొన్నారు. ఆయనకు విప్లవ శ్రేణుల మధ్యనే అంత్యక్రియలు పూర్తి చేసి శ్రద్దాంజలి అర్పించినట్లుగా వివరించారు. ఆర్కే అమరత్వం పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు. ఆర్కే గుంటూరు జిల్లా పల్నాడులో 1958 సంవత్సరంలో జన్మించారని..ఆయన తండ్రి స్కూల్ ఉపాధ్యాయుడని వివరించారు. ఆర్కే పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసించారని..కొంత కాలం తండ్రిలో కలిసి టీచర్ గా పని చేసారని పేర్కొన్నారు.
ఆయన విప్లవ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ
1978 లో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితుడై పీపుల్స్ వార్ లో సభ్యత్వం తీసుకున్నాడని ప్రకటనలో గుర్తు చేసారు. 1982 లో పార్టీకి పూర్తి కాలపు కార్యకర్తగా వచ్చారని పేర్కొన్నారు. గుంటూరు పల్నాడు ప్రాంతంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడని వివరించారు. 1992 లో రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యారని.. ఆ తరువాత దక్షిణ తెలంగాణ ఉద్యమానికి నాలుగేళ్ల పాటు నాయకత్వం అందించారని పేర్కొన్నారు. 2004లో ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం ముందు ప్రజల డిమాండ్లను పెట్టి..తమ వాదన సమర్ధవంతంగా వినిపించారని కీర్తించారు.
ప్రభుత్వంతో చర్చల తరువాత హత్యకు ప్రయత్నం
ప్రభుత్వం చర్చల నుంచి వైదొలిగి నిర్బంధం ప్రయోగించి.. ఆర్కేను హత్య చేయటానికి ప్రారంభించగానే..ఆయన్ను ఏఓబీ ఏరియాకు కేంద్ర కమిటీ బదిలీ చేసి ఏఓబీ బాధ్యతలు ఇచ్చిందని వివరించారు. 2018 లో ఆయన్ను కేంద్ర కమిటీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించిందని పేర్కొన్నారు. ఆర్కేకు శిరీషతో వివాహం అయిందని ప్రకటనలో వివరించారు. తండ్రి బాటనే నడిచిన ఆయన కుమారుడు మున్నా విప్లవోద్యమంలో ఉంటూ 2018లో జరిగిన రామగైడ ఎన్ కౌంటర్ లో మరణించిన విషయాన్ని చెప్పుకొచ్చారు.
Recommended Video
భార్య శిరీషా- కళ్యాణ రావు నినాదాలు
విప్లవోద్యమానికి నిస్వార్దంగా సేవలిందించారని పేర్కొంటూ.. తన ఆశయాన్ని తుది కంటూ సాగించి..ప్రజాస్వామిక విప్లవాన్ని పూర్తి చేస్తామంటూ పార్టీ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. దీంతో..ఆర్కే భార్య ఈ విషయం తెలిసిన వెంటనే రోదించారు. ప్రజల కోసమే ఆర్కే నిలబడ్డారంటూ చెప్పుకొచ్చారు. విరసం నేత కళ్యాణ్ సైతం ఆర్కేకు జోహర్లు అర్పిస్తూ నినాదాలు ఇచ్చారు. ఇది ప్రభుత్వ హత్యగా పేర్కొన్నారు.