కీలక దశకు రాజధానుల విచారణ : చట్టాలు చేయకుండా నిలువరించలేం - మరో రూపంలో బిల్లు..!!
ఏపీలో రెండేళ్లకు పైగా సాగుతున్న మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో కీలక దశకు చేరుకుంది. కొద్ది నెలల క్రితం ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో సీఆర్డీఏ రద్దు..అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను వెనక్కు తీసుకుంది. అదే సమయంలో మరింత సమగ్రంగా బిల్లులను సభ ముందుకు తీసుకొస్తామని ప్రకటించింది. అప్పటికే ఈ బిల్లులు - చట్టాల పైన హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటి పైన హై కోర్టు విచారణ సాగిస్తున్న సమయంలో ప్రభుత్వం ఆకస్మికంగా ఈ బిల్లులను వెనక్కు తీసుకుంది.
ప్రభుత్వం తప్పించుకోవటానికే
ఆ తరువాత ఈ కేసు ఇప్పుడు కీలక దశలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేయటం వెనుక ఉద్దేశం న్యాయస్థానం నుంచి విచారణను తప్పించుకోవటమేనని పిటీషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. ఆ చట్టాన్ని రద్దు చేసి...మరోసారి చట్టాలని తీసుకొస్తామంటూ సభలోనే ప్రభుత్వం చెప్పిన విషయాన్ని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. మూడు రాజధానుల చట్టాన్ని తెచ్చే శాసనాధికారం, మళ్లీ దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసుకున్న నేపథ్యంలో... రాజధాని అమరావతి నిర్మాణాన్ని బృహత్ ప్రణాళిక ప్రకారం నిర్దిష్ట కాలంలో పూర్తి చేసేలా ఆదేశించాలని కోరారు.
మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు
పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ, శాసనసభ కార్యదర్శి తరఫు వాదనల కోసం విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా పడింది. తాము దాఖలు చేసిన పలు వ్యాజ్యాల్లో రాజధానిలో నిలిచిపోయిన పనులను కొనసాగించాలని, భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్రాంతంలో ప్లాట్లు ఇచ్చేలా ఆదేశించాలని చేసిన అభ్యర్ధనను మరోసారి న్యాయస్థానానికి నివేదించారు.
ఇదే సమయంలో.. అమరావతి అభివృద్ధికి గతంలో ఇచ్చిన యథాతథ స్థితి ఉత్తర్వులు అడ్డంకి కాదంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది.
ప్రభుత్వానికి అధికారం లేదంటూ
మూడు రాజధానుల చట్టాన్ని చేసే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని... దాన్ని రద్దు చేస్తూ మళ్లీ చట్టం చేసే అధికారం అసలే లేదని వాదిస్తూ... రాజధాని వ్యవహారం పార్లమెంట్ పరిధిలోనిదని పిటీషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు జరిగేలా ఆదేశించండి. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం జిల్లా పేరు, సరిహద్దులను మార్చే వెసులుబాటు మాత్రమే రాష్ట్రానికి ఉంది. అంతేతప్ప... రాజధాని ప్రాంతంపై రాష్ట్రానికి అధికారం కల్పించలేదంటూ తమ వాదనలు కొనసాగించారు.
Recommended Video
అలాంటి ఆదేశాలు ఇవ్వలేం
మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతికి భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అందుకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని పిటీషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. వాదనల్లో భాగంగా.. మూడు రాజధానుల చట్టం, దాన్ని రద్దు చేస్తూ తీసుకొచ్చిన తాజా చట్టం చెల్లుబాటు కానివిగా ప్రకటించాలంటూ పిటీషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరు హైకోర్టును కోరారు. దీనికి స్పందించిన న్యాయస్థానం చట్టాలు చేయకుండా ముందే నిలువరించాలని కోరుతున్నట్లుందని వ్యాఖ్యానించింది. చట్టాలు చేయకుండా నిలువరించలేమని, అలాంటి ఆదేశాలను ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో..ఇక, ఫిబ్రవరి 2న జరిగే విచారణ కీలకం కానుంది.