బీజేపీకి కొత్త పూజారి వచ్చాడు...ఛాలెంజ్:కన్నాపై సీఎం చంద్రబాబు సెటైర్లు
శ్రీకాకుళం:ఇక్కడ బీజేపీకి కొత్త పూజారి వచ్చాడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాజపా నూతన అధ్యక్షుడిగా నియమించబడిన కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రంగసాగారం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎపి బిజెపి నూతన అధ్యక్షుడిపై సెటైర్లు వేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాడని కన్నా సర్టిఫికెట్ ఇచ్చారని, వైసీపీకి వెళ్ళటానికి సిద్ధమైన నేతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని చేస్తే ఇలాంటి మాటలే వస్తాయని చంద్రబాబు విమర్శించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వారు తనపై విమర్శలు చేయడం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సారవకోట మండలం రంగసాగరంలో నీరు చెట్టు పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 180 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బొంతు ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం సావరకోట మండలంలోని రంగసాగరం, బురుజువాడ, చిన్నకిట్టలపాడులో పర్యటించారు.ఈ కార్యక్రమాల్లో మంత్రులు పితాని, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు తదిదరులు పాల్గొన్నారు.
అనంతరం రంగసాగరం చెరువు దగ్గర జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 50 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి వారందరికీ పెద్దకొడుకునయ్యానని అన్నారు. ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, ఐదు బడ్జెట్లలో తెలుగు ప్రజలకు కేంద్రం అన్యాయం చేసిందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమంపై తన కంటే బాగా చేస్తే చర్చకు రావాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు.
మరోవైపు ఎపి బిజెపి నూతన అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల ఫలితాలు టీడీపీ, కాంగ్రెస్కు చెంపపెట్టు అన్నారు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసే కర్ణాటకలో ప్రజలు ఓటు వేశారన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో పార్లమెంటు స్థానాలు పెరుగుతాయని, ఏపీలో బీజేపీకి ఎక్కువ ఎంపీ స్థానాలు గెల్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలలో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు.
ఏపీకి ఇచ్చిన హామీలను బీజేపీ అమలుపరుస్తుందని కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా తనను నియమించడంతో రాష్ట్ర బీజేపీలో చెలరేగిన అసంతృప్తులపై స్పందించారు. పార్టీలో సీనియర్, జూనియర్ అని ఉండదని, తనకు అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల అపోహలు వద్దన్నారు. అభ్యంతరాలుంటే అధిష్టానమే పరిస్థితులను చక్కదిద్దుతుందని చెప్పారు. తనకు అపారమైన రాజకీయ అనుభవం ఉందని, పార్టీలో అందరినీ కలుపుకుని పనిచేస్తానని కన్నావివరించారు.