ఎర్రచందనం స్మగ్లింగ్ లో నయా ట్రెండ్:పేదరికమే పెట్టుబడి...ఉపాధి పేరిట మోసం!
చిత్తూరు: ఎర్రచందనం అక్రమ రావాణాకు స్మగ్లర్లు కొత్త మార్గాలు అవలంభిస్తున్నారు. నిరుపేదల పేదరికాన్ని, అమాయకత్వాన్నిఆసరాగా చేసుకొని కోట్లు కొల్లగొడుతున్నారు. మీకు చక్కటి ఉపాధి చూపిస్తామని మాయమాటలు చెబుతూ వారిని అడవి బాట పట్టిస్తున్నారు. వారికి ఎర వేసేందుకు ముందుగానే కొంత డబ్బు అడ్వాన్స్ గా ఇస్తున్నారు.
మంచి ఉపాధి లభిస్తుందని ఆశతో వచ్చిన వారిని ఎర్రచందనం దుంగలను నరకడం కోసం శేషాచలం అడవుల్లోకి పంపిస్తున్నారు. ఆ తరువాత తాము చేయాల్సినదేమిటో తెలుసుకున్న ఆ అమాయకులు వారిచ్చిన డబ్బు కుటుంబ అవసరాల కోసం వినియోగించడంతో...డబ్బు తిరిగి ఇవ్వలేక అలాగే అయిష్టంగానే అడవుల్లోకి వెళుతున్నారు...ఆ తర్వాత జరిగే పరిణామాల్లో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో జరుగుతున్నదారుణాలు ఇవి...
పేదరికమే...పెట్టుబడి
ఎపిలోని చిత్తూరు జిల్లాకు ఆనుకుని ఉన్న క్రిష్ణగిరి, కావేరిపట్నం, ధర్మపురి, వేలూరు, గుడియాత్తం, పేర్నంబట్ ప్రాంతాల్లోని అటవీప్రాంత వాసులు, అలాగే పలమనేరు, కుప్పం నియోజకవర్గంలోని గాంధీనగర్, జగమర్ల, దేవళం పెంటమండిపేట, కోటూరు, చెత్తపెంట, కాలువపల్లె, యానాదికాలనీ, సెంటర్, నెల్లిపట్ల, బాపలనత్తం, వెంగంవారిపల్లె, కొత్తిండ్లు, కేసీ పెంట, పాటు పెద్దపంజాణి, వీకోట అటవీప్రాంత సమీప గ్రామాల వాసులు అడవుల్లో దొరికే ఉత్పత్తులను సేకరించి కొందరు ఉపాధి పొందగా, మరికొందరు అడవుల్లో పశువులను మేపడం, ఇంకొందరు ఉపాధి పనులకు వెళ్లడం చేసేవారు. అయితే కారణాలేమైనప్పటికి వీరికి కొంతకాలంగా వీరికి జీవనోపాధి కష్టమైంది. దీంతో కుటుంబ పోషణ కష్టతరమైంది. ఇలాంటి పరిస్థితుల కోసమే కన్నేసి ఉండే ఎర్రచందనం మాఫియా వెంటనే రంగంలోకి దిగింది. వీరి దుర్భర పరిస్థితులను ఆసరాగా తీసుకొని వల పన్నడం ప్రారంభించింది.
ముగ్గులోకి దింపేందుకు...ముందుగానే అడ్వాన్సులు
ముందుగా ఇలా ఉపాధి లేక అవస్థలు పడుతున్న జనావాసాలను ఈ ఎర్రచందనం మాఫియా ముఠాలు గుర్తిస్తాయి. ఆ తరువాత వారి వద్దకు వెళ్లి చిత్తూరు జిల్లాలో అపార్ట్ మెంట్ల నిర్మాణం, కేబుల్ వైర్లు లాగే పనులు, చెట్లు కొట్టడం వంటి పనులు ఉన్నాయని కూలీలకు చెబుతారు. ఆ పనులకు డబ్బు కూడా బాగా ఇస్తారని నమ్మిస్తారు. అలా ఈ పనులకు వచ్చేందుకు సిద్దపడిన వారిలో యువకులనే ఎంపిక చేసుకుంటారు. ఆ తరువాత గ్రామ పెద్దల ద్వారా వారికి అడ్వాన్స్ గా ఉంచుకోండంటూ పది వేల రూపాయల దాకా ముందుగానే ఇస్తున్నారు. ఆ తరువాత తాము చెప్పినప్పుడు పనిలోకి రావాలని చెబుతారు. ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ జనాలు డబ్బును అవసరాల కోసం వాడేసుకుంటున్నారు. ఆ తరువాత ఎర్రచందనం మాఫియా ఏజంట్లు వీరిని పనిలోకి రమ్మని పిలిచి అడవుల్లోకి పంపిస్తున్నారు. అలా పనుల్లోకి వెళ్లిన కూలీల్లో కొందరు ఏళ్ల తరబడి ఇంటికి కూడా తిరిగిరాలేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలా కొందరు వ్యక్తుల ఆచూకి నేటికీ తెలియకపోయినా వారి కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదన్నది వాస్తవం.
భక్తుల్లాగా పంపించి...ఆ తరువాత అడవుల్లోకే...
ఇలా పనుల పేరుతో బయలదేర తీసిన కూలీలను తిరుమలకు వెళ్లే భక్తుల్లా లగేజీతో బస్సుల్లో చిత్తూరు జిల్లాలోకి తీసుకొస్తారు. ఇంకొందరైతే కాలినడకన వచ్చేస్తారు. ఇలా అనుకోని విధంగా ఎర్రచందనం చెట్లను కొట్టేపనుల్లోకి అడుగుపెట్టిన కూలీలు ఇక ఆ తరువాత వేరే ఇతర పనులకు వెళ్లడం లేదు. మీ ఫోటోలు తీసారు, బైట తిరిగితే పోలీసులు పట్టుకుంటారని బెదిరించి ఈ దందాలోనే కొనసాగేలా చేస్తున్నట్లు బాధితులే చెబుతున్నారు. మరికొందరు ఈ ఎర్రచందనం చెట్లు నరికే పనిలో రోజుకు రూ.500 కూలీ, మద్యం, బిర్యానీలు లభిస్తుండటంతో అలాగే కంటిన్యూ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ పనుల్లో ఉత్సాహం చూపించిన కొందరు నెలల వ్యవధిలోనే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడం, టీవీలు, ఫ్రిజ్లు వంటి వాటిని కొనుగోలు చేయడం చూసి మరికొందరు రిస్క్ అని తెలిసినా ఈ బాట పడుతున్నారు.
ఇలా కూలీలను తరలించేందుకు...ప్రత్యేక ఏజెంట్లు
ఈ విధంగా శేషాచలం అడవుల్లోకి కూలీలను సరఫరా చేసేందుకు చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఏజెంట్లు పనిచేస్తున్నట్టు సమాచారం. వీరే ఇలా కూలీలను సిద్దం చేసి వారిని అడవుల్లోకి తీసుకెళుతున్నట్లు తెలిసింది. వీరికి కావాల్సిన పనిముట్లు, లగేజీ ఆటోలు, దుంగలను తరలించేందుకు తప్పుడు రిజిస్టేషన్ నంబర్లతో కూడిన వాహనాలు కూడా ఈ ఏజెంట్లే సమకూర్చుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.కాబట్టి ఈ కూలీల గురించి తెలుసుకోవాలంటే వారిని సరఫరా చేస్తున్న కీలకమైన ఏజెంట్లను పట్టుకుంటేనే తెలిసే అవకాశం ఉంది. ఈ ఎర్రచందనం అక్రమ దందాను నిలువరించేందుకు గట్టి చర్యలు తీసుకోకుంటే ఎంతో మంది అమాయకులు ఈ ఉచ్చుల్లో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకోవడమో లేదా జైళ్లలో మగ్గిపోవడమో జరుగుతూనే ఉంటుంది.