దాడి ముందు రోజు రాత్రి:మావోయిస్టులు జీలుగ కల్లుతో మజా...పోలీసుల నాటు కోడి విందు!
విశాఖపట్టణం:మజా చేసేది మీరేనా?...మేము మాత్రం పార్టీ చేసుకొని రిలాక్స్ కావద్దా...అన్నట్లుగా అరకు దాడికి ముందు రోజు రాత్రి అటు మావోయిస్టులు...ఇటు పోలీసులు మందు విందుతో మజా చేసుకున్నారట.
ఎమ్మెల్యే కిడారి,మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యల కేసులో ప్రత్యేక పోలీసుల బృందం విచారణ సందర్భంగా వెలుగుచూస్తున్న విషయాలు నివ్వెరపరుస్తున్నాయట. మావోల దాడి గురించి వందలాదిమందిని ప్రశ్నిస్తున్న క్రమంలో వారికి ప్రత్యక్షంగా సహకరించిన కొందరిని పోలీసులు గుర్తించి ఆరా తీయగా దాడికి ముందు రోజు రాత్రి పోలీసులు నాటుకోడితో పార్టీ చేసుకుంటే, మావోయిస్టులు జీలుగు కల్లుతో మజా చేసుకున్నారని తెలిసి విస్తుపోయారట.
గిరిజనులకు...అధికారి హుకుం
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు స్వీయ రక్షణ విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పోలీసులు, మామూళ్ల మత్తులో పడి గ్రామాల్లో తిరగడమే మానేశారని ఉన్నతాధికారులకు అందిన నివేదికల్లో తేలింది. మైదాన ప్రాంతాల్లో పనిచేసి పనిష్మెంట్పై అరకు ప్రాంతానికి వచ్చిన ఓ పోలీసు అధికారి ఇక్కడకు వచ్చిన తరువాత విందుల్లో మునిగితేలడమే సరిపోయిందట. గిరిజనులు ప్రతి ఆదివారం తనకు తప్పనిసరిగా నాటుకోడి పంపాల్సిందేననేది ఈ అధికారి హుకుం జారీ చేశారట.
ముందు రోజు...పోలీసుల విందు
ఆ క్రమంలో ఒక్కోసారి శనివారం రాత్రి నుంచే పార్టీ మూడ్ లోకి వెళ్లిపోయే ఆయన ఆ రోజు తనకు అత్యంత సన్నిహితులైన మిత్రులతో కలసి మంచి ‘విందు' చేసుకుంటారట. అలాగే నక్సలైట్ల అరకు దాడి ముందు రోజు సెప్టెంబర్ 22 రాత్రి కూడా ఆయన అదే పనిలో ఉన్నారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఆ రాత్రి ఆయన గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఒక వైద్యుడితో కలసి పార్టీ చేసుకున్నారని తెలిసిందట.
అదే రాత్రి...మావోయిస్టుల మజా
ఇటు మావోయిస్టుల విషయానికొస్తే ఎమ్మెల్యే కిడారి హత్య కోసం తమకు సహకారం అందించేందుకు ఒడిశా,ఛత్తీస్ ఘడ్ దండకారణ్యం నుంచి గిరిజనులను రప్పించా రట. అలా సెప్టెంబరు 22 రాత్రికి గ్రామానికి వచ్చిన ఆ గిరిజనుల్లో అత్యధికులు మహిళలు ఉండటంతో పాటు వారి కోరికమేరకు మావోలు స్థానికుల చేత సమీప అడవి నుంచి జీలుగకల్లు తెప్పించి పార్టీ ఇచ్చారట. ఇంకా విందులో మజా కోసం దూడమాంసం కోసం ప్రయత్నించినా దొరకలేదని అందుకే దొరికిన మాంసాలతో సరిపెట్టుకున్నారని తెలిసిందట.
టార్గెట్ పక్కా ఫిక్స్...ఇలా
టార్గెట్ ఫినిష్ చేసే వ్యూహంలో భాగంగా స్థానిక గిరిజనుల పేర్లను వాడుతూ ఎమ్మెల్యే అనుచరులకు మావోలే ఫోను చేయించారట. మా ఊరికి ఎమ్మెల్యే సార్ ఎన్ని గంటలకు వస్తున్నారు?...అని వారితో అరా తీయించారని పోలీసులుకు తెలిసిందట. నిజానికి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాత్రమే మావోయిస్టుల టార్గెట్ కాగా ఆయనతో కలసి ఆ దారిలో రావడంవల్లే మాజీ ఎమ్మెల్యే సోమనూ చంపారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఇక కిడారికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఆయన సన్నిహితులనుంచే తెలుసుకున్న మావోలు,కిడారికి బంధువులు అయ్యే ఓ జంటను బెదిరించి ఆయన రాకపోకల గురించి పక్కాసమాచారం పొందినట్లు తెలుసుకున్నారు. అలాగే కిడారి కారు డ్రైవర్,అనుచరులు,గన్మెన్ నంబర్లు కూడా దాడికి ముందే మావోయిస్టులు సంపాదించారని తెలిసింది.