కేసీఆర్కు వాస్తు చిక్కు: ప్రజల సొమ్ము వృథా, వాస్తు నిపుణుడికి..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 'వాస్తు' ఆలోచన పైన విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అంతగా వాస్తు పిచ్చి ఉంటే తన సొంతింటికి, తన సొంత డబ్బులతో ఖర్చు చేసుకోవచ్చునని, కానీ ప్రజల సొమ్మును అందుకు ఉపయోగించరాదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
మంగళవారం శాసన మండలిలో కాంగ్రెస్ నేతలు వాస్తు అంశం పైన నిలదీశారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రభుత్వం వాస్తు పేరుతో ప్రజల సొమ్మును వృథా చేస్తోందన్నారు. అంతలా వాస్తు కావాలనుకుంటే కేసీఆర్ తన ఇంటిని లేదా తనకు సంబంధించిన స్థలాలలో వాస్తుకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ అభద్రతతో ఉన్నారన్నారు.
దీనిపై కేసీఆర్ ఆ తర్వాత సాయంత్రం సభలో మాట్లాడిన విషయం తెలిసిందే. తాను వాస్తు ప్రకారం అంటే అందరూ ఏదో అన్నారని, అయితే ఒక వాస్తు కోసమే సచివాలయం మార్పు చేయడం లేదని, అడ్మినిస్ట్రేషన్ అంతా ఒక్కచోట ఉండటం కోసం కూడా చేస్తున్నానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కాగా, ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజను తెలంగాణ ముఖ్యమంత్రి గత నెల తీసుకున్నారు. ప్రభుత్వ భవంతులకు అతను వాస్తు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.
కాగా, ఇతనికి నెలకు డెబ్బై అయిదు వేల రూపాయల వరకు ఇవ్వనున్నట్లుగా ఊహాగనాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ తెలంగాణ ప్రజల బాగు కోసమే చేస్తున్నారని సుధాకర్ తేజ అంటున్నారు. వాస్తు మూఢనమ్మకం కాదని, వెంటిలేషన్, గాలి తదితరాలకు అనుగుణంగా సూచనలు చేయడమని ఆయన అభిప్రాయపడ్డారు.