మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం: ఏ పార్టీ ఎటు వైపు, తేల్చని టిఆర్ఎస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీల ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలు సోమవారం లోకసభ ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎటు వైపు ఉంటుందనే ఆసక్తి నెలకొని ఉంది.
టిడిపి ప్రతిపాదించిన తీర్మానం తొలుత ప్రస్తావనకు వచ్చినా మద్దతు తెలియజేయాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించింది. కాంగ్రెసు, పిఎంలు ఇప్పటికే బేషరతుగా మద్దతు ప్రకటించాయి. ఎన్డీఎకు వెలుపలి పార్టీలు మద్దతు పలుకుతున్నారు.
నవీన్ పట్నాయక్ మౌనం....
అవిశ్వాస తీర్మానంపై బిజెడి అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన వైఖరిని స్పష్టం చేయలేదు. ఆయనకు లోకసభలో 20 మంది పార్లమెంటు సభ్యులున్నారు. పలు సందర్భాల్లో ఆయన బిజెపిపై విమర్శలు గుప్పించారు. అయితే, యునైటెడ్ ఫ్రంట్ లేదా పెడరల్ ఫ్రంట్లో చేరే విషయంపై ఇంకా ఆలోచన చేయలేదని ఆయన ఇటీవల అన్నారు.
కేసీఆర్ కూడా మౌనం
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానంపై భిన్న ప్రకటలు చేసి సందర్భాలు ఉన్నాయి. అయితే, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాత్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు. పైగా అవిశ్వాస తీర్మానం సభ ముందుకు వస్తున్న తరుణంలో ఆయన మమతా బెనర్జీతో భేటీకి కోల్కతా వెళ్లారు.
యూటర్న్ తీసుకున్న అన్నాడియంకె....
అవిశ్వాస తీర్మానంపై అన్నాడియంకె యూటర్న్ తీసుకుంది. తొలుత మద్దతు ఇస్తామని ప్రకటించిన అన్నాడియంకె తర్వాత వెనక్కి తగ్గింది. అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని ప్రకటించిన పార్టీ అధికార ప్రతినిధిపై వేటు కూడా వేసింది. ఎన్డీఎ భాగస్వామ్య పక్షం కాకపోయినప్పటికీ అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఆ పార్టీ పని చేసే అవకాశాలున్నాయి.
శివసేన కూడా వ్యతిరేకమే...
బిజెపిపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన శివసేన అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శివసేన అవిశ్వాసానికి మద్దతు ఇస్తుంందని అందరూ భావించారు. కానీ, అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకుంది .