టిటిడికి ఎపి ప్రభుత్వం నుంచి విముక్తిపై పిటిషన్:సుప్రీంకోర్టులో సోమవారం విచారణ
న్యూఢిల్లీ:తిరుమల తిరుపతి దేవస్థానం ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేయాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి, సత్య సభర్వాల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. టిటిడి వివాదం సందర్భంగా ఈ ఏడాది జూన్ లో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై తాను న్యాయ నిపుణుల బృందంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. టీటీడీని ఎపి ప్రభుత్వం నుంచి విముక్తి చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసేందుకు చర్చలు జరుపుతున్నామని అప్పట్లో ఆయన తెలిపారు.
ప్రధానార్చకుడు రమణ దీక్షితులును టిటిడి బలవంతంగా పదవీ విరమణ చేయించడం, అనంతరం రమణ దీక్షితులు స్థానంలో ఏ. వేణుగోపాల దీక్షితులు ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు చేపట్టడం ఆఘమేఘాల మీద జరుగగా ఆ క్రమంలో రమణ దీక్షితులు మాట్లాడుతూ తాను ప్రోటోకాల్ను అనుసరించి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసినందుకే తనను బాధితుడిని చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఆ నేపథ్యంలో ఈ వివాదం పలు మలుపులు తిరగగా...అదే క్రమంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి టిటిడి విషయమై పిల్ దాఖలు చేయడానికి ఈ పరిణామాలు ప్రేరణగా నిలిచాయి. అలా దాఖలైన ఈ పిల్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని సుబ్రహ్మణ్యం స్వామి ఆదివారం ట్వీట్ చేశారు. తద్వారా ఈ సమాచారం వెలుగు లోకి వచ్చింది.
ఇదిలావుంటే శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. తిరుమల శ్రీవారిని శనివారం 73,607మంది భక్తులు దర్శించుకున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు.స్వామివారిని దర్శించుకునేందుకు కేవలం నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా... శ్రీవారి ఉచిత దర్శనానికి 5గంటల సమయం పడుతోంది. అలాగే టైం స్లాట్, నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 2 గంటల సమయం పడుతోంది.