ప్రభుత్వం ఇచ్చిన ఫోన్...పర్సులోనే పేలి పోయింది:అంగన్ వాడీల్లో ఆందోళన
అనంతపురం:రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పరిపాలనలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు అందజేసిన సెల్ఫోన్లు పేలిపోతుండటం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఆయా సెల్ ఫోన్లు వినియోగిస్తున్న ఐసిడిఎస్ సిబ్బంది తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు.
తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రభుత్వం ఓ అంగన్ వాడీ కార్యకర్తకు ఇచ్చిన సెల్ ఫోన్ పేలిపోవడం కలకలం రేపింది. పట్టణంలోని బోయ వీధిలోని అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న కార్యకర్త యల్లవతి పర్సులో ఉన్న సెల్ ఫోన్ అందులో ఉండగానే హఠాత్తుగా పేలిపోయింది. ఈ సంఘటన తో ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అయితే ఊహించని విధంగా సెల్ ఫోన్ పర్సులో పేలిపోవడంతో ఆ సెల్ఫోన్ నామరూపాల్లేకుండా పోవడంతో పాటు పర్సులో ఉన్న రూ.2600 నగదు కూడా కాలి పోయిందని ఆమె వాపోయారు. పేలిన సెల్ ఫోన్ కార్బన్ కంపెనీకి చెందినదని గా తెలుస్తోంది. అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు సెల్ఫోన్లో పొందుపరిచి వాటి వివరాలు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపించేందుకు గాను వివిధ శాఖల సిబ్బందితో పాటు ఐసిడిఎస్ ఉద్యోగులకు సెల్ ఫోన్ అందచేశారు. అలా అంగన్ వాడీ కార్యకర్త యల్లవతికి ప్రభుత్వం అందజేసిన కార్బన్ కంపెనీ సెల్ఫోనే పేలిపోయింది.
మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్ పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక వైపు ఆ ఫోన్లు సరిగా పనిచేయకపోవడం, మరొక వైపు ఏకంగా పేలిపోతుండటంతో ఐసీడీఎస్ సిబ్బందితో పాటు అవే రకం సెల్ ఫోన్లు తీసుకున్న ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందిలోనూ భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు రెండు నెలల క్రితం ముద్దినాయనపల్లికి చెందిన అనురాధ అనే అంగన్వాడీ కార్యకర్త తన సెల్ఫోన్ ను చార్జింగ్ పెట్టిన సమయంలో అది పేలిపోయింది.
దీంతో ఎప్పుడు ఎవరు సెల్ ఫోన్ పేలుతుందోనని అంగన్వాడీ సిబ్బంది భీతిల్లుతున్నారు. తాజాగా యల్లవతి సెల్ ఫోన్ పేలుడు ఘటనపై స్పందించిన సీడీపీఓ గీతాంజలి మాట్లాడుతూ కార్బన్ కంపెనీకి చెందిన రూ.6వేలు విలువైన సెల్ఫోన్లను సిబ్బందికి అందజేసినట్లు వెల్లడించారు. అయితే మూడు నెలల వ్యవధిలోనే ప్రభుత్వం ఇచ్చిన రెండు ఫోన్లు పేలిపోవడంతో సిబ్బంది భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో ఈ సమస్యను ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఆమె తెలిపారు.