మెగా బ్రదర్స్ కి అచ్చి రాని రాజకీయం..! ప్రశ్నగా మిగిలిపోనున్న పవన్ ప్రయాణం..!!
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చి, ప్రశ్నగా మిగిలారు. ఉప్పెనలా దూసుకొస్తానంటూ, ఉసూరుమన్నారు. కింగ్ లేదంటే కుమారస్వామిలా కింగ్ మేకర్ అవుతానంటూ, స్టేజి దద్దరిల్లేలా ప్రసంగించాడు. చివరికి తన సీటునూ గెలవలేకపోయాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటి..? జనసేనను జనం ఎందుకు ఆదరించలేదు..? గాజు గ్లాసును తుక్కుతుక్కుగా ఎందుకు ముక్కలు చేశారు. నాడు అన్న చిరంజీవి, నేడు తమ్ముడు పవన్ కల్యాణ్ ఆటలో అరటిపండులా ఎందుకు మిగిలారు..? జనసేన ఏమాత్రం పోటీనివ్వకపోడానికి కారణాలేంటి..?
పూర్తి స్థాయిలో ప్రశ్నించలేక పోయిన పవన్..! సోదరులకు కలిసి రాని రాజకీయం..!!
రాజకీయ పార్టీ అంటే ఒక నిర్మాణం ఉంటుంది. పొలిట్ బ్యూరో, కార్యవర్గం, జిల్లా, మండల, గ్రామ కార్యదర్శులు, ఇలా క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం ఉంటుంది. ఎంత పాపులర్ లీడరైనా, సినీ గ్లామరున్నా, గ్రౌండ్ లెవల్లో క్యాడర్ లేకపోతే, అన్నీ వున్నా సున్నా. జనసేనలో పవన్ కల్యాణ్ తప్ప ఎవరూ కనిపించరు. అసలు పార్టీ నిర్మాణమే లేదు. ఒకరిద్దరూ తప్ప, ఎవరూ ముందుకు వచ్చి మాట్లాడరు. పార్టీ విధానాలేంటో ఇప్పటికీ తెలియదు. ప్రజారాజ్యం టైంలోనైనా పార్టీ నిర్మాణం కొంతైనా కనిపించింది. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో అలాంటిదేమీలేదు. టీడీపీ, వైసీపీ వంటి క్షేత్రస్థాయి బలమున్న పార్టీలతో తలపడుతున్నామన్న కనీస విజ్నత లేకుండా, పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలేశారు పవన్. అందుకే ఇంత ఘోరాతి ఘోర ఓటమి చవి చూడాల్సి వచ్చిందనే చర్చ జరుగుతోంది.
జనాల్లో ఉండేదే రాజకీయం..! ప్రజలతో మమేకం కాలేకపోయిన పవన్..!!
అదేంటో విచిత్రంగా పవన్ కల్యాణ్, ప్రతిపక్షంపై విమర్శలదాడి చేశారు. ఐదేళ్లు పాలించిన అధికారపక్షాన్ని వదిలేసి, అపోజిషన్లో కూర్చున్న వైసీపీని తూర్పారబట్టారు. మీకు ఆత్మగౌరవం లేదా, తెలంగాణ నేతలతో కుమ్మక్కయిన వైసీపీని ఆదరిస్తారా అంటూ, సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ నుంచి వైసీపీ పారిపోయిందని, అదే తానయితే సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడినని చెప్పుకున్నారు. దీంతో చంద్రబాబు, పవన్లు కుమ్మక్కయ్యారని వైసీపీ ఆరోపించింది. బాబు వదిలిన బాణమంటూ వైసీపీ చేసిన ఆరోపణలు, జనంలోకి బలంగానే వెళ్లాయి. అందుకే ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ను తిరస్కరించారు. 2014 ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించారు పవన్ కల్యాణ్. కానీ ఎప్పుడు జనంలోకి వస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలి..! జనసేన వ్యూహం మార్చాలి..!!
ఆవేశపూరితంగా ప్రసంగించడం, నాలుగు తిట్లు తిట్టడం వెళ్లిపోవడం వంటి పద్దతులు జనాలకు పెద్దగా ఎక్కలేదని చెప్పాలి. సీఎం కావాలన్న బలమైన కాంక్ష కూడా పవన్లో కనపడలేదు. అధికారంలోకి రావడానికి రాజకీయాల్లోకి రాలేదని, 20 ఏళ్లపాటు పోరాడతామని చెప్పారు పవన్. దీంతో అటు క్యాడరు లేక, ఇటు లీడర్లు లేక చతికిలబడింది జనసేన. ఒకవైపు జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాటాలు. కేంద్ర, రాష్ట్ర పాలకులేమో స్టేటస్పై దోబూచులాటలు. ఇలాంటి టైంలో హోదా కోసం బలమైన వాయిస్ వినిపించాల్సిన పవన్, మోడీ, బాబు మీద మొహమాటమో, ఎందుకు అనడం అనుకున్నారో కానీ, స్టేటస్ మీద సైలెంటయ్యారు. చివరికి తూర్పు, పశ్చిమ గోదావరిలో తన వర్గం ఓట్లను కూడా ఆకర్షించలేకపోయారు. ఈ రెండు జిల్లాల్లోనూ జనసేన వైఫల్యానికి కారణం, పీఆర్పీ లాగే పవన్ కూడా, జనసేనను ఏదో ఒక పార్టీలో కలిపేస్తాడేమోనని కాపు వర్గం నేతలు, ప్రజలు అనుమానిస్తున్నారు.
రాబోవు ఐదేళ్లు జానాల్లో ఉండాలి..! ప్రజల విశ్వాసం పొందితే తిరుగుండదంటున్న శ్రేణులు..!!
నాడు పీఆర్పీ కోసం ఆస్తులు సైతం అమ్ముకున్న నేతలు, ఈసారి మాత్రం ఇటువైపు చూడలేదనడానికి ఫలితాలే తార్కాణం. చివరికి సీపీఎం, సీపీఐ, బీఎస్పీలతో జట్టుకట్టినా, కనీస పోటీ ఇవ్వలేకపోయారు. కేవలం ఓట్లు చీల్చే పార్టీగానే మిగిలిపోయింది జనసేన. ఆ రకంగా టీడీపీకి నష్టాన్ని మిగిల్చింది. ఆరంభంలోనే వచ్చిన ఈ ఫలితాన్ని గుణపాఠంగా తీసుకుని పవన్ కల్యాణ్, ఇప్పటికైనా పార్టీ నిర్మాణం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల తరపున నిత్యం పోరాటం చేయడానికి సిద్డపడతాడో, లేదంటే అన్నయ్యలా తనకూ రాజకీయాలు అచ్చిరావని, ప్యాకప్ చెప్పి, సినిమాలకు తిరిగి మేకప్ వేసుకుంటాడో చూడాలి.