జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది అంటున్న టీడీపీ
ఏపీ అసెంబ్లీలో ప్రతి రోజు వాడీ వేడి చర్చ జరుగుతుంది. మాటల తూటాలు పేలుతున్నాయి . ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీకి అధికారం పిచ్చివాడి చేతిలో రాయిలా మారిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు . వాళ్లకు వాళ్లు కొట్టుకోవచ్చు, ఎదుటి వాళ్లను కొట్టొచ్చు అని చంద్రబాబు అన్నారు. తమ చేతకానితనం కప్పి పెట్టుకోవాలని జగన్ ప్రభుత్వం ఇదంతా చేస్తోందని చెప్పారు చంద్రబాబు . ఇక సభలో వైసీపీ మంత్రులు మాట్లాడిన తీరుపై డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడు విరుచుకు పడ్డారు .పాలన గాలికి వదిలేసిందంటూ భగ్గుమన్నారు .
కేంద్రం వద్దన్నా..జగన్ డోన్ట్ కేర్: చంద్రబాబును వదిలేది లేదు: విచారణలో ముందుకే...!
జగన్ దృష్టి అంతా కూల్చివెయ్యటమే అన్న చంద్రబాబు
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. పీపీఏల(విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు)పై కేంద్రం ఒక రకంగా చెబుతుంటే వైసీపీ మరోలా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీఏలలో అవినీతి లేదని రాష్ట్రానికి కేంద్రం లేఖ కూడా రాసిందన్నారు. అయినా సరే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందంగా జగన్ వ్యవహార శైలి ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాలపై వైసీపీ ప్రభుత్వానికి దృష్టి లేదన్న చంద్రబాబు కూల్చివేయడమే వీళ్లకు తెలిసిన పని విమర్శించారు. జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్ట్ పనులను , రాజధాని నిర్మాణాలను ఆపాలని చూస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ వైఖరి వల్లే రాజధానిలో భూముల విలువ పడిపోయిందన్నారు. ఇలాగే చేస్తే ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి సైతం కుంటుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
జగన్ కు పాలన చేతకాదు .. పాలన గాలికొదిలేసిన ఘనుడు జగన్ అన్న అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడు. జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వానికి పాలన చేతకాదన్నారు. విచారణ కమిటీలు అంటూ హడావిడి చేసి పాలనను గాలికొదిలేశారంటూ విరుచుకుపడ్డారు. ఆసరా పెన్షన్లపై జగన్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని ఆసరా పెన్షన్ల విషయంలో ఎంత మందికి ఎంతిచ్చామో నిరూపించేందుకు మేం సిద్దం .. మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు.
చనిపోయిన వైఎస్ వల్ల కియా మోటార్స్ వచ్చిందన్న బుగ్గనకు మతి ఉండే మాట్లాడుతున్నారా అని ఫైర్
ఇక కియామోటార్స్ కంపెనీ వైయస్ రాజశేఖర్ రెడ్డి వల్లే వచ్చిందంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. బుగ్గనకు మతి ఉండే మాట్లాడుతున్నారా అంటూ మండిపడ్డారు . 2009లో చనిపోయిన వైయస్ చెబితే 2017లో కియా కార్ల కంపెనీ వచ్చిందా అంటూ నిలదీశారు అచ్చెన్నాయుడు . కియామోటార్స్ కు ఎకరా ఆరు లక్షలకు తమ ప్రభుత్వం అందజేస్తే దాన్ని రూ. 60లక్షలకు పెంచేసి ఒక భయాన్ని క్రియేట్ చేసింది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమంటూ ఆరోపించారు. ఇక సభలో ఆరోపణలు గుప్పిస్తున్న వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు , నేతలు కూడా మండిపడుతున్నారు.