ప్రధాని పదవి అంటే కుస్తీ పోటీ కాదు...బుర్ర పెంచుకోవాలి:జూపూడి ప్రభాకర్
Recommended Video
అమరావతి:ప్రధాని పదవి అంటే కుస్తీ పోటీ కాదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. ప్రధాని మోడీ...బాడీ ఫిట్నెస్ అంటూ ఛాలెంజ్లు చేస్తున్నారని, అయితే నాయకులు బాడీ పెంచడం కాదని...బుర్ర పెంచుకోవాలని జూపూడి సూచించారు.
ప్రధాని మోడీ బ్యాంకులను దోచుకున్న వారిని కాపాడుతున్నారని జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ పేరుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడని...అతడు జగన్కు ఏజెంట్ అని జూపూడి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ సినిమాలు కాదని, జగన్కు నిజమైన సినిమా వచ్చే ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారని జూపూడి ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కడప స్టీల్ ప్లాంట్పై కేంద్రాన్ని జగన్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని జూపూడి ప్రశ్నించారు.
మరోవైపు టీడీపీ ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్రం మరోసారి మోసం చేసిందన్నారు. మెకాన్ సర్వేలో ఉక్కు ఫ్యాక్టరీపై సానుకూలత వ్యక్తమైనా అఫిడవిట్ ద్వారా కేంద్రం ఈ విషయమై దుర్బుద్ధిని చూపించిందని నానీ మండిపడ్డారు. దీంతో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాష్ట్రం పట్ల ప్రేమ ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని తేలిందన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం కడపలో జరిగే దీక్షల్లో టీడీపీ ఎంపీలతో పాటు వైసీపీ ఎంపీలు కూడా పాల్గొనాలని కేశినేని నాని పిలుపు ఇచ్చారు.