బొత్సా తాజా వ్యాఖ్యలతో రియల్ ఎస్టేట్ డమాల్... మూలిగే నక్క మీద తాటికాయ పడిందిగా
రాజధాని అమరావతిపై తాజాగా బొత్సా చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ అసలే కుదేలైన రియల్ ఎస్టేట్ మీద తీవ్రంగా పడనుంది. మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా బొత్సా వ్యాఖ్యల దుమారం రాజధానిలోని రియల్టర్లకు షాక్ ఇచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండే ఏపీలో రాజధాని అమరావతి పై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని అభివృద్ధి పనులను నిలుపుదల చేయించారు అని, అలాగే సెక్రటేరియట్ ను మారుస్తున్నారని, అంతేకాదు రాజధాని పేరు మార్పు కూడా చేయనున్నారు అని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాస్త ప్రచారం సద్దు మణిగినా మళ్ళీ పురపాలక శాఖామంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ రచ్చ మొదలైంది. రాజధాని పరిసర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ ఇప్పటికే దెబ్బ తింది. తాజా వ్యాఖ్యలతో రియల్టర్లకు ఇప్పట్లో కోలుకోలేని చావు దెబ్బ తగిలినట్టే అనే భావన వ్యక్తం అవుతుంది.
వైసీపీ పాలనలో రాజధానిలో రియల్ ఎస్టేట్ కుదేలు .. తాజా వ్యాఖ్యలతో పూర్తిగా దెబ్బ
రాజధాని అమరావతి.. ఎప్పుడైతే ఏపీ రాజధాని అమరావతిగా మారిందో వెలగపూడి, కాజ సమీపంలోని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ ఒక్కసారి భూం అందుకుంది. భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వేలకోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. పంట పొలాలని కొనుగోలు చేసిన రియల్టర్లు పెద్ద ఎత్తున తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఎక్కడ చూసిన బహుళ అంతస్తుల భవనాలతో, కమర్షియల్ కాంప్లెక్స్ లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరిగింది.
ఇక చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతిని చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రహ్మాండంగా తమ వ్యాపారం కొనసాగించారు. ఇక అపార్ట్ మెంట్ లలో ఒక చదరపు గజం 5వేలకు పైనే పలికింది. కానీ ఇప్పుడు వాటి వంక చూసిన నాధుడు లేరు. చాలా అపార్ట్ మెంట్ లు కొనుగోలు చేసేవారు లేక వెలవెలబోతున్నాయి.పెట్టుబడి పెట్టిన రియల్టర్లు ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని సతమతమవుతున్నారు. చాలా సార్లు ఈ పరిస్థితులు మారకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటున్న రియల్టర్లు కూడా లేకపోలేదు .
బొత్సా తాజా వ్యాఖ్యలతో రియల్టర్ల గుండెల్లో గుబులు
ప్రస్తుతం వైసిపి అధికారంలోకి రావడంతో జగన్ రాజధానిని మారుస్తాడా అన్న అనుమానాలు మొదట్లో కలిగినా ఆ అంశం నుండి ప్రజలు బయటకు వచ్చేశారు . ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మరోమారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కన్నీళ్లు తెప్పించేలా ఉన్నాయి. రాజధాని నిర్మాణం విషయంలో మొన్నటిదాకా అవినీతి జరిగిందంటూ ,అవినీతిని బయటకు తీయడానికి , సమీక్షించాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఒక కారణం అయితే, తాజాగా రియల్ ఎస్టేట్ వర్గాలకు బొత్సా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఏ మాత్రం జీర్ణించుకోలేని అతి పెద్ద కారణం . ఇక ఈ నేపథ్యంలో రాజధాని పరిస్థితి ఎలా ఉంటుందో అన్న అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవుతోంది. రియల్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది .
తెరమీదకు మరోసారి రాజధాని అంశం .. రియల్టర్లకు పిడుగుపాటు వార్త
ఒక పక్క కొనేవారు లేక, ఇసుక కొరతతో నిర్మాణాలు చెయ్యలేక రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిని ఇబ్బందుల్లో ఉంటే రాజధాని సురక్షిత ప్రదేశంలో లేదని దీనిపై ప్రభుత్వంతో చర్చించి తమ నిర్ణయాన్ని తర్వాత ప్రకటిస్తామని బొత్సా చెప్పటం రాజధానిపై జరిగిన ప్రచారానికి ఊతమిస్తుంది . రాజధాని మార్పు సాధ్యాసాధ్యాల విషయం అటుంచితే దీని ప్రభావం మాత్రం మొదట పడేది రాజధాని పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపైనే అని చెప్పక తప్పదు .మరో సారి అమరావతి అంశం తెరమీదకు రావటం రాజధానిపై అనుమానాలు కలిగేలా మంత్రి బొత్సా వ్యాఖ్యలు చెయ్యటం అసలే దెబ్బతిని మూలుగుతున్న రియల్టర్లకు పిడుగుపాటు వార్తే .