ఆత్మకూరులో టీడీపీ..వైసీపీ చేసిందేంటి : ఒకే సామాజిక వర్గంలో విభేదాలు : రాజకీయంగా ఇలా..!!
ఏపీలో సంచలనంగా మారిన ఛలో ఆత్మకూరు ఘటన వెనుక అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. నిజంగా టీడీపీ చెబుతున్నట్లుగా అక్కడ వైసీపీ నేతలు వారి పార్టీ శ్రేణుల పైన దాడులు చేసారా. అందుకే వారు గ్రామం వదిలి వచ్చేసారా. వారికి టీడీపీ శిబిరం అందుకే ఏర్పాటు చేసిందా. అందుకే టీడీపీ పోరాటం చేసిందా..అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ప్రభుత్వం అక్కడ రాజకీయంగా ఎటువంటి దాడులు జరగలేదని స్పష్టం చేస్తోంది. టీడీపీకి పోటీగా అధికార పార్టీ సైతం ఛలో ఆత్మకూరు నిర్వహణకు పిలుపునిచ్చింది. పోలీసులు రెండు పార్టీల నేతలను నియంత్రించినా అసలు వాస్తవంగా ఆత్మకూరులో అసలు రగడ ఏంటి. రాజకీయ పార్టీలు ఎలా అనుకూలంగా మలచుకున్నాయనేది ఆసక్తి కరంగా మారింది. అయితే..ఇక్కడ రాజకీయ పోరు కంటే ఒకే సామాజిక వర్గంలో ఏర్పడిన చిన్నపాటి విబేధాలు కక్ష్యలుగా మారాయి. తాజాగా ఎన్నికల తరువాత జరిగిందేంటంటే...
ఒకే సామాజిక వర్గం..చిన్న వివాదం ఇప్పుడు..
తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుండి ఆత్మకూరులోని ఎస్సీలు..పెరిక సామాజిక వర్గం వారు ఆ పార్టీకి అండగా నిలుస్తున్నారు. 1989లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు టీడీపీ..కాంగ్రెస్ వర్గాల మధ్య గడవ జరిగి ఎస్సీలపై దాడి చేయటంతో పురుషులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. ప్రత్యర్ధులు ఇళ్ల దహనాలు చేసి కొందరు మహిళలను గాయపరిచారు. ఆ సమయంలో నాటి టీడీపీ అధినేత ఎన్టీఆర్ గ్రామానికి వచ్చి ఎస్సీలకు తిరిగి గ్రామ ప్రవేశం చేయించారు. అప్పటి నుండి ప్రశాంతంగానే ఉంది. అంతకు ముందు 1968లో ఆత్మకూరులో పెరిక..రెడ్డి సామాజిక వర్గాలకు చెందని కొందరు వ్యక్తుల మధ్య గొడవ లు జరిగాయి. ఆ సమయంలో పెరిక వర్గానికి చెందిన వారు ఎస్సీలతో కలవగా..మిగిలిన వారు కాంగ్రెస్ లో ఉండేవారు. ఇక, టీడీపీ ఏర్పాటు అయిన తరువాత ఎస్సీలు..పెరిక వర్గాల వారు టీడీపీలో చేరారు. మిగిలిన వారు కాంగ్రెస్ లో కొనసాగుతూ వైసీపీ ఏర్పాటుతో ఆ పార్టీలో చేరిపోయారు. 2014లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ఎస్సీలు..పెరికలు కలిసి ఏసోబుకు మద్దతుగా పని చేసి గెలిపించారు. ఎస్సీలంతా సీమప బంధువులే. 2016లో గ్రామంలో జరిగిన శుభకార్యంలో చిన్న వివాదం వారి మధ్య చీలకకు కారణమైంది. అందులో గొడవ పడిన 20 కుటుంబాల వారు గ్రామం వదలి వెళ్లిపోయారు. వీరికి అప్పట్లో వైసీపీ నేతలు అండగా నిలవటంతో వారు ఆ పార్టీలోనే ఉంటున్నారు.
2019 ఎన్నికలతో...
ఇక, 2019 ఎన్నికల్లో పోలింగ్ రోజు వచ్చి గ్రామంలో ఓటింగ్ లో పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ 20 కుటుంబాల వారు గ్రామానికి వచ్చారు. జూన్ 1న టీడీపీకి చెందిన వ్యక్తి దుర్గి నుండి ఆత్మకూరు వస్తుండగా వైసీపీకి చెందిన కొందరు దాడి చేయటంతో గాయపడ్డారు. దీంతో.. ఆందోళనకు గురైన 65 కుటుంబాల వారు గ్రామం వదిలి వెళ్లారు. ఈ విషయం టీడీపీ అధినాయకత్వానికి తెలియటం తో వారు వారిని గుంటూరు తీసుకొచ్చారు. అయితే వారు గ్రామంలోకి తిరిగి రావటానికి భయం వ్యక్తం చేసారు. టీడీపీ మద్దతు దారులు కావటంతో వారికి టీడీపీ అండగా నిలిచింది. అయితే..వారందరి మీద దాడులు జరగలేదని..ఇది రెండు కుటుంబాల వ్యవహారం అంటూ పోలీసులు వివరించారు.
ఛలో ఆత్మకూరు కు
ఇక..టీడీపీ వారికి మద్దతుగా ఛలో ఆత్మకూరు కు పిలుపునిచ్చింది. పోటీగా వైసీపీ సైతం ఛలో ఆత్మకూరుకు నిర్ణయించింది. దీంతో..పోలీసులు రెండు పార్టీల వారికి అనుమతి ఇవ్వకుండా రెండు పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసారు. పోలీసులు బాధితులను ఆత్మకూరుకు తరలించారు. అక్కడ పోలీసు పికెట్ ఏర్పాటు చేసారు. ఈ వ్యవహారం తరువాత గ్రామంలోని రెండు వర్గాల వారు ఇక భవిష్యత్ లో ఎటువంటి గొడవలు లేకుండా కలిసి ఉంటామని చెబుతున్నారు.